రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో తెలంగాణ రీ పిటీషన్ .. విచారణకు ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.ఈ పథకంపై తెలంగాణకు చెందిన గవినోళ్ళ శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై చెన్నైలోని ఎన్జీటీ ధర్మాసనం విచారణ నిర్వహించి పిటిషనర్ తరపు వాదనలు, ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది.
ఇదే వ్యవహారంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణా ప్రభుత్వం తమ అభ్యంతరాలను తెలియజేయటానికి అవకాశం ఇవ్వాలని,కేసు రీ ఓపెన్ చెయ్యాలని కోరింది. దీంతో చెన్నై ఎన్జీటీ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టనుంది.
రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ వాదనలు వినేందుకు ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో కేసు మరోమారు రీ ఓపెన్ కానుంది . కేసు రీ-ఓపెన్ చేయాలన్న తెలంగాణా ప్రభుత్వ దరఖాస్తును ఎన్జీటీ చెన్నై ధర్మాసనం సమ్మతించింది. ఇప్పటికే తెలంగాణకు చెందిన గవినోళ్ళ శ్రీనివాస్ వేసిన పిటిషన్పై జాతీయ హరిత ట్రిబ్యునల్ లో వాదనలు జరిగాయి. కేంద్ర పర్యావరణ శాఖను దీనిపై తమ అభిప్రాయం చెప్పాలని ఆదేశించి ,తీర్పు రిజర్వ్ చేసింది.
కానీ తెలంగాణా ప్రభుత్వ దరఖాస్తు నేపధ్యంలో కేసు మరోమారు విచారించనున్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. అభ్యంతరాలు చెప్పేందుకు సమయం సరిపోలేదని తెలంగాణ గవర్నమెంట్ దరఖాస్తులో విన్నవించింది.తమకు కోర్టుకు విన్నవించుకునే అవకాశం ఇవ్వాలని కోరింది . తమ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని గతంలో అఫిడవిట్ వేసింది తెలంగాణా సర్కార్ . ఇప్పుడు మళ్ళీ ఆ కేసును విచారించాలని చెన్నై లోని జాతీయ హరిత ట్రిబ్యునల్ ను కోరింది. దీనిపై తదుపరి విచారణ జస్టిస్ రామకృష్ణనన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈనెల 28కి వాయిదా వేసింది.