క్షుద్రపూజలు: వృద్ధుడిని చితకొట్టారు: ఏపీకి 500 తెలంగాణ బస్సులు..!
హైదరాబాద్: న్యూ ఇయర్, సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని రద్దీకి తగ్గట్టుగా బస్సు సర్వీసులను నడిపేందుకు అవసరమైతే ఏపీఎస్ఆర్టీసీకి 500 బస్సులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ తెలిపారు.
జనవరి 1 నుంచి 20 వరకూ మహాత్మాగాంధీ బస్స్టేషన్ నుంచి తెలంగాణ, ఏపీల్లోని అన్ని జిల్లా కేంద్రాలకూ మొత్తం 2,715 బస్సులను నడుపుతామని ఆయన వెల్లడించారు. తెలంగాణ ఆర్టీసీ, రద్దీ ఎక్కువైతే మరిన్ని సర్వీసులు నడుపేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ప్రత్యేకంగా నడపనున్న స్పెషల్ బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్నామని సోమవారం ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో మాత్రమే అదనపు చార్జీలను వసూలు చేస్తున్నట్టు వారు వివరించారు. పండుగ నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ తిరికి వచ్చేందుకు కావాల్సిన బస్సులను ఏపీ ప్రభుత్వం కోరితే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
క్షుద్రపూజలు చేస్తున్నాడని వృద్దుడిపై దాడి
వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ యాదవ్నగర్లో సోమవారం క్షుద్రపూజల కలకలం రేగింది. నెల్లికుదురు మండలం వావిలాల శివారు తండాకు చెందిన లచ్చిరామ్ నాయక్ (65) మరికొందరితో కలిసి యాదవ్ నగర్ కాలనీలో ఆదివారం అర్థరాత్రి క్షుద్రపూజలు చేస్తున్నాడు.
దీంతో అక్కడి స్థానిక యువకులు అతడిని అదుపులోకి తీసుకుని చితకబాదారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వృద్దుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.