తెలంగాణలో కొత్తగా 5186 కరోనా కేసులు.. మరో 38 మంది మృతి...
తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5186 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 38 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం(మే 8) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
హెల్త్ బులెటిన్ ప్రకారం... మరో 2374 రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,92,385కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 2704 కి చేరింది. ప్రస్తుతం 68,462 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 7994 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,21,219కి చేరింది.
ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.1శాతం ఉండగా... తెలంగాణలో 0.54 శాతం ఉంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 85.4 శాతం ఉండగా తెలంగాణలో 81.9 శాతం ఉంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 904 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,45,57,646 కరోనా టెస్టులు నిర్వహించారు.
రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సామాజిక,రాజకీయ,క్రీడా,వినోద,విద్యా,మత,సాంస్కృతికపరమైన అన్ని రకాల సామూహిక కార్యక్రమాలను నిషేధించింది. పెళ్లిళ్లు,ఇతర శుభకార్యాలు కేవలం 100 మందితో నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది. మాస్కులు,భౌతిక దూరం పాటిస్తూ శుభకార్యాలు నిర్వహించుకోవాలని సూచించింది.
రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూను కూడా ప్రభుత్వం మరో వారం రోజులకు పొడగించిన సంగతి తెలిసిందే. మే 8 నుంచి మే 15వ తేదీ వరకు కర్ఫ్యూని పొడగించింది. ఏప్రిల్ 20 నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది.