కరోనా..అన్ కంట్రోల్: తెలంగాణలో మరోసారి భారీగా కేసులు: ఆ అయిదారు జిల్లాల్లో తీవ్రంగా
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతికి అడ్డుకట్ట పడట్లేదు. పాజిటివ్ కేసుల వెల్లువ ఎప్పట్లాగే కొనసాగుతోంది. వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. జిల్లాలతో పోల్చుకుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా తీవ్రత అత్యధికంగా ఉంటోంది. జీహెచ్ఎంసీ పరిధి సహా రంగారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ అర్బన్, కరీంనగర్ జిల్లాల్లో కేసుల ఉధృతి తీవ్రంగా ఉంటోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలను తీసుకుంటోంది.
కొత్తగా 1891 పాజిటివ్ కేసులు..
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 1891 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1088 మంది డిశ్చార్జి అయ్యారు. 10 మంది మరణించారు. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ కార్యాలయం కొద్దిసేపటి కిందటే బులెటిన్ను విడుదల చేసింది. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 66,677కు చేరుకుంది. ఇందులో 47,590 మంది డిశ్చార్జి అయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు తిరిగి వెళ్లారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 540కి పెరిగింది. యాక్టివ్ కేసులు 18,547కు చేరుకున్నాయి.
జాతీయ సగటుతో పోల్చుకుంటే.. మరణాల శాతం తక్కువే..
జాతీయ సగటుతో పోల్చుకుంటే తెలంగాణలో నమోదవుతోన్న మరణాల శాతం 0.85 శాతంగా నమోదైంది. జాతీయ సగటు 2.15 శాతంగా ఉన్నట్లు అధికారులు తమ బులెటిన్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే కావడం.. అక్కడి తీవ్రతను స్పష్టం చేస్తోంది. 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 517 కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 181, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 146 కేసులు వెలుగులోకి వచ్చాయి. వరంగల్ అర్బన్-138, నిజామాబాద్-131, సంగారెడ్డి-111, కరీంనగర్-93 పాజిటివ్ కేసులు 24 గంటల వ్యవధిలో వెలుగులోకి వచ్చాయి.
జిల్లాలవారీగా 24 గంటల్లో నమోదైన కేసులు ఇవీ..
ఆదిలాబాద్-19, భద్రాద్రి కొత్తగూడెం-32, జగిత్యాల-14, జనగామ-15, జోగుళాంబ గద్వాల-38, కామారెడ్డి-42, ఖమ్మం-47, మహబూబ్ నగర్-33, మహబూబాబాద్-24, మంచిర్యాల-28, మెదక్-21, ములుగు-11, నాగర్ కర్నూలు-1, నల్లగొండ-46, నారాయణపేట్-11, నిర్మల్-8, పెద్దపల్లి-37, రాజన్న సిరిసిల్ల-28, సిద్ధిపేట్-27, సూర్యాపేట్-35, వికారాబాాద్-8, వనపర్తి-13, వరంగల్ రూరల్-22, యాదగిరి భువనగిరి-12 కేసులు 24 గంటల వ్యవధిలో నమోదు అయ్యాయి. జయశంకర్ భూపాపల్లి జిల్లాలో కొత్తగా ఒక్క కేసూ నమోదు కాలేదు.
Recommended Video
అయిదు లక్షలకు చేరువైన శాంపిళ్ల టెస్టులు..
24 గంటల వ్యవధిలో మొత్తం 19,202 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ బులెటిన్లో పేర్కొన్నారు. దీనితో ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 4,77,795కు చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్, సీబీనాట్ ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబొరేటరీల్లో ముమ్మరంగా శాంపిళ్ల టెస్టులను కొనసాగిస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అన్ని చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా కట్టడి ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.