తెలంగాణలో కొత్త ఆశలు: కరోనా తగ్గుముఖం పట్టిందా?: వెయ్యికి దిగువగా: టెస్టుల్లోనూ క్షీణత
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతికి అడ్డుకట్ట పడినట్టే కనిపిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. చాలాకాలం తరువాత వెయ్యికంటే తక్కువ దిగువకు రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలతో పోల్చుకుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా అన్ని జిల్లాల్లోనూ కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. కొద్దిరోజులుగా నమోదవుతోన్న కేసులతో పరిగణనలోకి తీసుకుంటే.. తాజాగా నమోదైన సంఖ్య కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. ఇదే పరిస్థితి మున్ముందు కనిపిస్తే.. కరోనా గండం నుంచి గట్టెక్కినట్టుగానే భావించుకోవచ్చని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
Recommended Video
కరోనా రోగులకు కేంద్రం భారీ వెసులుబాటు- ఆస్పత్రుల్లో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు..
కొత్తగా 983 పాజిటివ్ కేసులు..
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 983 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1019 మంది డిశ్చార్జి అయ్యారు. 11 మంది మరణించారు. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ కార్యాలయం కొద్దిసేపటి కిందటే బులెటిన్ను విడుదల చేసింది. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 67,660కి చేరుకుంది. ఇందులో 48,609 మంది డిశ్చార్జి అయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు తిరిగి వెళ్లారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 551కి పెరిగింది. యాక్టివ్ కేసులు 18,550లుగా నమోదు అయ్యాయి.
మరణాల శాతం అదుపులో..
జాతీయ సగటుతో పోల్చుకుంటే తెలంగాణలో నమోదవుతోన్న మరణాల శాతం 0.85 శాతంగా నమోదైంది. జాతీయ సగటు 2.13 శాతంగా ఉన్నట్లు అధికారులు తమ బులెటిన్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో నమోదైన కేసుల్లో అత్యధికం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే అయినప్పటికీ.. కొద్దిరోజుల కిందటి నాటి పరిస్థితులతో పోల్చుకుంటే సంఖ్య భారీగా తగ్గింది. 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 273 కేసులు నమోదు అయ్యాయి. వందకుపైగా రోజువారీ కేసులు నమోదైన రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వరంగల్ అర్బన్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో కేసులు బాగా తగ్గాయి.
జిల్లాలవారీగా నమోదైన కేసులు ఇవీ..
ఆదిలాబాద్-16, భద్రాద్రి కొత్తగూడెం-16, జగిత్యాల-12, జనగామ-13, జయశంకర్ భూపాలపల్లి-12, జోగుళాంబ గద్వాల-12, కామారెడ్డి-28, కరీంనగర్-54, ఖమ్మం-23, కొమరం భీమ్ ఆసిఫాబాద్-7, మహబూబ్ నగర్-21, మహబూబాబాద్-18, మంచిర్యాల-1, మెదక్-18, మేడ్చల్ మల్కాజ్గిరి-48, ములుగు-14, నాగర్ కర్నూలు-32, నల్లగొండ-11, నారాయణపేట్-2, నిర్మల్-2, పెద్దపల్లి-44, రాజన్న సిరిసిల్ల-20, రంగారెడ్డి-73, సంగారెడ్డి-37, సిద్ధిపేట్-6, సూర్యాపేట్-11, వికారాబాాద్-4, వనపర్తి-26, వరంగల్ రూరల్-25, వరంగల్ అర్బన్-57, యాదగిరి భువనగిరి-5 కేసులు 24 గంటల వ్యవధిలో నమోదు అయ్యాయి.
అయిదు లక్షలకు చేరువైన శాంపిళ్ల టెస్టులు..
24 గంటల వ్యవధిలో మొత్తం 9,443 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ బులెటిన్లో పేర్కొన్నారు. దీనితో ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 4,87,238కి చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్, సీబీనాట్ ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబొరేటరీల్లో ముమ్మరంగా శాంపిళ్ల టెస్టులను కొనసాగిస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అన్ని చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా కట్టడి ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.