ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో మౌన దీక్ష.. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదంటున్న జేఏసీ
హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమయ్యారు కార్మిక సంఘాల నేతలు. సీఎం కేసీఆర్ మొండి వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపిస్తూ.. సమ్మెపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నారు. శుక్రవారం నాటితో సమ్మె ఏడో రోజుకు చేరడంతో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ఆ క్రమంలో శనివారం (12.10.2019) నాడు అన్నీ డిపోల దగ్గర కార్మికుల కుటుంబాలతో కలిసి మౌన దీక్ష చేస్తామని ప్రకటించారు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి.
ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తును పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు అశ్వత్థామ రెడ్డి. ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరే క్రమంలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరగా ఆయన సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సపోర్ట్ ఇవ్వడంతో పాటు ఈ పోరాటంలో బీజేపీ భాగస్వామం అవుతుందని ఆయన హామీ ఇచ్చినట్లు చెప్పారు.
అక్రమ సంబంధం గుట్టురట్టు.. అత్తమామలు తిత్తి తీశారుగా..! (వీడియో)
ఆర్టీసీని కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మరోసారి ఆరోపించిన అశ్వత్థామ రెడ్డి.. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వ్యాఖ్యానించారు. ఆ క్రమంలో కార్మిక సంఘాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. అదలావుంటే సమ్మెకు టీఎన్జీవోల మద్దతు ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తమకు మద్దతు ప్రకటించాయని గుర్తు చేశారు. ఆర్టీసీ సమ్మెను నిర్వీర్యం చేసేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కుటిల ప్రయత్నాలను తిప్పి కొడతామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు అశ్వత్థామ రెడ్డి.