నా పక్కన మరో వ్యక్తా, మా పరువు పోయింది, గొడవలు: టీ ప్రభుత్వ ప్రకటనలపై మహిళ ఆగ్రహం
Recommended Video
హైదరాబాద్: తన అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వ ప్రకటనల్లో తన భర్తగా వేరొకరిని చూపడాన్ని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగ్రాయికి చెందిన మహిళ పద్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది.
ఇందులో కొన్ని ప్రకటనల్లో పద్మ భర్తగా ఒకరిని, మరికొన్ని ప్రకటనల్లో ఇంకొకరిని చూపించారు. తన భర్త ఫొటోను మార్చడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ప్రస్తుతం యాదగిరి సమీపంలోని కొంగవల్లిలో ఉంటున్న తమ వద్దకు వచ్చి మూడు సంవత్సరాల క్రితం కొందరు ఫొటోలు తీసుకున్నారని చెప్పారు.
కంటి వెలుగు ప్రారంభోత్సవం సమయంలో
తాము కాపుసారా కాచుకుని, దాన్ని తాగేవాళ్లమని, ఇప్పుడు సారా కాయడం లేదని, ఆనందంగా ఉన్నామని చెబుతూ పేపర్లో ప్రకటన ఇచ్చారని, ఆ తర్వాత రైతు బంధు పథకం పెట్టిన సమయంలో తమకు పొలం ఉందని, రూ.4 వేలు ప్రభుత్వం నుంచి అందుకుని ఆనందంగా ఉన్నామని మరో ప్రకటన వేశారని తెలిపింది. కంటివెలుగు ప్రారంభం సమయంలో తన భర్త ఫొటో బదులు వేరొకరి ఫొటో పెట్టారని ఆమె ఆరోపించారు. దానిని చూసిన చాలామంది తమను ఎద్దేవా చేస్తున్నారని చెప్పారు. తాను తలెత్తుకు తిరగలేకపోతున్నానని చెప్పారు. తమకు పొలం లేదని, అయినా చెక్కులు ఇచ్చినట్లు చూపించారన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లామన్నారు.
పాపకు స్నానం చేయిస్తుంటే ఫోటోలు తీసుకొని వెళ్లారు
ఆమె మాట్లాడుతూ... తాము పాత చీరలు, బొంతలు కుట్టుకుంటామని, ఒకరోజు, ఐదుగురో, పదిమందో వచ్చారని, గొడుగులు అవి తీసుకు వచ్చారని, మీకు లోన్లు ఇస్తామని చెప్పారని, ఆ తర్వాత సంతకం పెట్టించుకున్నారో లేదో గుర్తుకు లేదని, తమకు మాత్రం లోన్లు ఇస్తామని చెప్పారని, తమ పాపకు స్నానం చేయిస్తుంటే ఫోటో తీసుకొని పోయారని తెలిపారు. ఆ తర్వాత మాకు ఏ విషయం తెలియదన్నారు.
నా పక్కన మా ఆయన ఫోటో కాకుండ ఎవరి ఫోటోనో పెట్టారు
ఆ తర్వాత బస్సుల్లో, బడులలో చూస్తే మా ఫోటోలు కనిపించాయని ఆమె వాపోయారు. అప్పుడు అడిగేవారు ఎవరూ లేక, మాకు తెలియక దానిని పట్టించుకోలేదన్నారు. భువనగిరిలోను ఫోటోలు పెట్టారని చెప్పారు. వాటి గురించి మాకు తెలియదన్నారు. ఆ తర్వాత 14వ తేదీన పేపర్లో వచ్చిందని (యాడ్) చెప్పారు. ఆ ఫోటోలు మావే అనుకున్నామని, అయితే నా పక్కన మా ఆయన ఫోటో పెట్టాలని, కాని ఎవరి ఫోటోనో పెడితే ఎలా అన్నారు.
మా పరువు పోయింది, మా ఇంట్లో గొడవలు
ఇతరుల ఫోటో పెడితే ఏమనుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇంట్లో పరువు పోయిందని, మా ఇంట్లో గొడవలు అవుతున్నాయని, తమకు న్యాయం చేయాలన్నారు. నా పర్మిషన్ లేకుండా నా పక్కన మరో వ్యక్తి ఫోటో పెట్టారని వాపోయారు.
మాకు న్యాయం చేయకుంటే
రైతు బీమా అని కూడా పెట్టారని, కానీ తమకు పొలాలు కూడా లేవన్నారు. కూలి చేసుకుంటేకే తమకు జీవితం సాగుతోందన్నారు. ఈ విషయంలో మాకు న్యాయం చేయాలని, లేదంటే మందు తాగి చచ్చిపోతానని అన్నారు. రైతు బీమా, కంటిచూపులకు పెట్టారని చెప్పారు. అంతకుముందు గుడుంబా గురించి పెట్టారని తెలిపారు.