అంతా తారుమారు, తగ్గిన టీడీపీ.. 14వ సీటు వదిలేసిన తమ్ముళ్లు: లాస్ట్ మినిట్లో ఊహించని ట్విస్ట్లెన్నో
హైదరాబాద్: తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రావడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, అందుకే మహాకూటమి పొత్తులో భాగంగా తమకు కేటాయించిన 14వ సీటును వదులుకున్నామని ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి సోమవారం అన్నారు. కూటమి విశాల ప్రయోజనాలు తమకు ముఖ్యమని చెప్పారు.
తెలుగుదేశం పార్టీలో రెబల్స్ లేరని చెప్పారు. ఆశావహులు మాత్రమే ఉన్నారని ఆయన అన్నారు. బీఫాం ఇవ్వకుండానే అసంతృప్తితో నామినేషన్ దాఖలు చేసిన తమ పార్టీకి చెందిన ఆశావహులు అందరూ కూడా తమ తమ దరఖాస్తులను ఉపసంహరించుకుంటారని ఆయన చెప్పారు.
చంద్రబాబు ప్రచారం రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది
మహాకూటమి తరఫున తమ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రచారం నిర్వహిస్తారని రావుల చెప్పారు. ఆయన ప్రచారానికి సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధమవుతోందని చెప్పారు. తమ పార్టీ అధినేతను విమర్శించనిదే తెరాస నేతలకు పూట గడవడం లేదన్నారు. నాలుగున్నరేళ్లలో కేసీఆర్ తాము ఏం చేశామో చెప్పకుండా విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.
టీడీపీ నేతలు పోటీ చేస్తున్న చోట చంద్రబాబు ప్రచారం
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలు పోటీ చేస్తున్న స్థానాల్లో ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది. హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఆయన ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. మిగతా కూటమి అభ్యర్థుల చోట్ల ప్రచారం చేయకపోవచ్చునని తెలుస్తోంది. కూకట్పల్లిలో నందమూరి సుహాసిని తరఫున చంద్రబాబు, నారా లోకేష్, నటుడు కళ్యాణ్ రామ్లు ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇబ్రహీంపట్నం టిక్కెట్పై ఊహించని ట్విస్ట్
ఇదిలా ఉండగా, మహాకూటమి పొత్తులో భాగంగా చివరి నిమిషంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీకి 14 స్థానాలు దక్కాయి. కానీ చివరి నిమిషంలో ఓ స్థానంలో టీడీపీకి బదులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. పొత్తులో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం టీడీపీకి వచ్చింది. కానీ సోమవారం మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఇబ్రహీంపట్నం టిక్కెట్ను టీడీపీ సామ రంగారెడ్డికి ఇచ్చింది. కానీ ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరు. దీంతో కాంగ్రెస్ నుంచి మల్రెడ్డి పోటీలో నిలబడ్డారు.
టీడీపీకి 14 సీట్లు ఇచ్చినా, 13 సీట్లలో పోటీ
పొత్తులో భాగంగా పటాన్చెరు టిక్కెట్ కూడా టీడీపీకి వచ్చింది. కానీ ఇక్కడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటా శ్రీనివాస గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో టీడీపీ వెనక్కి తగ్గింది. మొత్తంగా టీడీపీ ఆశించిన పలు సీట్లలో పోటీ చేయలేకపోయింది. పైగా తమకు వచ్చిన 14 సీట్లకు గాను ఒక సీటు తగ్గి, 13 సీట్లలో టీడీపీ పోటీ చేస్తోంది.
Recommended Video
ఆర్ కృష్ణయ్యకు టిక్కెట్
పొత్తులో భాగంగా మిర్యాలగూడ స్థానం తెలంగాణ జన సమితికి దక్కింది. కానీ బీసీ నేత, మాజీ టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఆయనకు టిక్కెట్ కేటాయించారు. టీజేఎస్ తరఫున విద్యాధర్ రెడ్డి బరిలో నిలిచారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ 94 సీట్లలో పోటీ చేయాలి. కానీ మరో ఆరుగురికి ఎక్కువగా బీఫాంలు ఇచ్చింది. టీడీపీ, తెలంగాణ జన సమితి పోటీ చేస్తున్న స్థానాల్లో కాంగ్రెస్ బీఫాంలు ఇచ్చింది. ఈ ఆరుగురు కాకుండా కాంగ్రెస్ అసంతృప్తులు పలువురు స్వతంత్రులుగా, రెబల్స్గా పోటీ చేస్తున్నారు.