తెలంగాణ సర్కార్ కు ఆ సామాజిక వర్గం అంటే గిట్టదా..?
హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయాలు సామాజిక వర్గాల హననం మీద నడుస్తున్నట్టు ఇటీవల పరిణామాలు రుజువు చేస్తున్నాయి. రాజకీయ ఎత్తుగడలకు పై ఎత్తులు, వ్యూహాలకు ప్రతివ్యూహాలు, ఆరోపణలకు ప్రత్యారోపణలు, విమర్శలకు సద్విమర్శలు వంటి చర్యలు రాజకీయాలకు వన్నె తెస్తాయి. ప్రజాస్వామ్యానికి స్పూర్తి దాయకంగా ఉంటాయి. కాని పగ, పంతం, ప్రతీకర రాజకీయాలు జుగుప్సాకరంగా ఉంటాయని రాజకీయ పార్టీలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. తెలంగాణలో ఇప్పుడు పార్టీల మద్య ప్రతీకార జ్వాలలు రగిలిపోతున్నాయి. అవి ఎంతటి పరాకాష్టకు చేరుతాయోననే సందేహం అన్ని వర్గాల నుండి వ్యక్తం అవుతోంది.
ఆపధర్మ ప్రభుత్వం..! ఆగమేఘాల మీద విచారణలు..! టార్గెట్ వారేనా..?
తెలంగాణలో కాంగ్రెస్, టిడిపి పొత్తుతో తన అధికారానికి అడ్డుకట్టు పడుతుందనే భావనతో టిఆర్ఎస్ అధ్యక్షుడు, ఆపథర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో తనకు ప్రధాన అడ్డంకిగా భావిస్తోన్న ‘రెడ్డి' సామాజికవర్గ నేతలను కేసీఆర్ లక్ష్యంగా చేసుకుంటున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. ముందస్తు ఎన్నికల పేరుతో అసెంబ్లీని రద్దు చేసి, హడావుడిగా ఎన్నికలకు కెసిఆర్ సిద్దమవుతున్న విషయం విదితమే. ఇంతవరకు బాగానే ఉన్న రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం ఎందుకనే ప్రశ్నలు తెలంగాణ సమాజంలో ఉత్పన్నమవుతున్నాయి.
తెలంగాణలో ఆ సామాజిక వర్గం పటిష్టం..! రాజకీయాలనుండి తప్పించాలన్నదే గులాబీ లక్ష్యం..!
అయితే చంద్రశేఖర్ రావుకు ఇబ్బంది కల్గిస్తారనుకుంటున్న వారందరిని ఏదో ఒక కేసు పేరుతో జైలు పాలు చేస్తున్నారని, ఆ సామాజిక వర్గానికి చెందినవారు ఆరోపిస్తున్నారు. మెదక్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి ని మహిళల అక్రమ రవాణా కేసు అంటూ జైలుకు పంపించిన ‘కెసిఆర్ ఆ తరువాత ‘రేవంత్రెడ్డి'కి పోలీసుల నుంచి నోటీసులు ఇప్పించారని అంటున్నారు. అలాగే వరంగల్కు చెందిన గండ్ర వెంకటరమణారెడ్డిని ఆయుధాల కేసులో అరెస్టు చేయడం కూడా పలు అనుమానాలకు తావిస్తోందనే చర్చ జరుగుతోంది.
ఎన్నికల ముందే ఎందుకు..! కావాలనే చేస్తోందని ప్రభుత్వం పై విమర్శలు..!
ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలను అరెస్టులు చేయించడంతో కెసిఆర్ ఆ వర్గాన్ని లక్ష్యం చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2004లో జరిగిన పాస్పోర్ట్ కేసును ఇప్పుడు ఆగమేఘాల మీద బయటకు తెచ్చి జగ్గారెడ్డి ని అరెస్టు చేయించారని అంత అర్జెంట్గా కేసుల విచారణ వేగంగా జరగాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఆ వర్గానికి చెందిన నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ఈ కేసు గురించి ఎప్పుడూ ప్రస్తావించిన ఉదంతాలే లేవని వారంటున్నారు. ఎన్నికలకు మరికొంత సమయం ఉన్న నేపథ్యంలో నిందితుడు అంటూ జయప్రకాష్రెడ్డిని అరెస్టు చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
భయపడమంటోన్న కాంగ్రెస్..! ఎందురు తిరుగుతాం అంటున్న నాయకులు..!!
మరో వైపు హౌసింగ్ సొసైటీ లో అక్రమాలు చేశారంటూ రేవంత్రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో త్వరలో అరెస్టులు ఉంటాయనే ప్రచారం విరివిగా జరుగుతోంది. మరోవైపు ఆయుధాల అక్రమ రవాణా కేసులో గండ్ర వెంకటరమణారెడ్డిని అరెస్టు చేశారు. కాగా ఒకే సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలను వివిధ కేసుల్లో అరెస్టు చేయించడం వారిని భయపెట్టడానికే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓడిపోతాననే అసహనంతోనే కెసిఆర్ ఇటువంటి అరెస్టులు చేయిస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తాము ఇటువంటి చర్యలకు భయపడబోమని కూడా వారు చెబుతున్నట్టు గాంధీ భవన్ వర్గాల సమాచారం.