తెలంగాణ సర్కార్ కొత్త మద్యం పాలసీ..! వ్యాపారుల్లో పెరుగుతున్న ఉత్కంఠ..!!
హైదరాబాద్ : కొత్త మద్యం పాలసీ పై తెలంగాణ సర్కార్ దృష్టి కేంద్రీకరించింది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాలను మరింత పెంచడంతోపాటు, భారీగా ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రెండేళ్ల ఎక్సైజ్ పాలసీ పూర్తికావస్తున్న నేపథ్యంలో కొత్త పాలసీపై దృష్టి సారించింది. సెప్టెంబర్లో ఎక్సైజ్ ఇయర్ పూర్తవుతుంది. తర్వాత కొత్తగా దుకాణాల కేటాయింపుల కోసం దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. దానికి అనుగుణంగా కొత్త పాలసీని ప్రకటించనున్నారు. నగరశివారు ప్రాంతాల్లో మారిన పరిస్థితుల నేపథ్యంలో ఎక్సైజ్ పాలసీలోనూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్తగా కొన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లుగా ప్రకటించిన నేపథ్యంలో పాలసీలో మార్పులు వచ్చే అవకాశం ఉందని కొందరు అధికారులు తెలిపారు. ఈసారి ఎక్సైజ్ పాలసీ ఏ విధంగా ఉంటుందన్న దానిపై మద్యం వ్యాపారుల్లో ఉత్కంఠ నెలకొంది.
రెండు నెలల్లో పూర్తికానున్న ఎక్సైజ్ గడువు..! లైసెన్స్ ఫీజులు పెంచుతారని ప్రచారం..!!
లైసెన్స్ ఫీజు పెంచే అవకాశం ఉందన్న విషయమై వ్యాపారులకు సమాచారం అందింది. గతంలో ఏడాదికోసారి కొత్త లైసెన్స్ ఇచ్చే విధానం ఉండేది. షాపులను వేలం వేసేవారు. ఎక్కువ ధర కోట్ చేసిన వారికి దుకాణాలను కేటాయించేవారు. ఈ పద్ధతిలో చాలామంది వ్యాపారులు రింగ్ అయి తమకు నచ్చినచోట దుకాణాలను దక్కించుకునే వారు. దీంతో మద్యం వ్యాపారుల మధ్య గొడవలకు ఆస్కారం ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం పాలసీలో మార్పులు తీసుకొచ్చింది. 2016-17, 2018-19 సంబంధించి రెండేళ్లకు లైసెన్స్ ఫీజు వసూలు విధానం అమలు చేస్తోంది. జంటనగరాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ జోన్లకు కలిపి హైదరాబాద్ జోన్లో 6, సికింద్రాబాద్ జోన్లో 5 ఎక్సైజ్ పోలీసుస్టేషన్ల పరిధుల్లో 199 మద్యం షాపులు ఉన్నాయి. 250 వరకు బార్లు ఉన్నాయి. కొత్త పాలసీలో భాగంగా ముందుగా మద్యం దుకాణాలనే కేటాయించేందుకు ఎక్సైజ్ అధికారులు సన్నద్దమవుతున్నారు.
ఆదాయం పెంచుకునే దిశగా ప్రభుత్వం సన్నాహాలు..! జీహెచ్ఎంసీ పరిధిపై ఫోకస్..!!
కొత్త ఎక్జ్సైజ్ పాలసీలో భాగంగా లైసెన్స్ కేటాయింపులో ఈసారి కూడా పారదర్శకంగానే వ్యవహరించనున్నారు. గతంలో మాదిరిగా వేలం విధానం కాకుండా జీహెచ్ఎంసీ పరిధిలోని దుకాణాలన్నింటికీ ఒకే ధరను నిర్ణయిస్తారు. రెండేళ్ల క్రితం ఒక్కో దుకాణానికి 1.8 కోట్ల రూపాయలు నిర్ణయించి రెండేళ్లకు 2.16 కోట్ల రూపాయలు వసూలు చేశారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో లైసెన్స్ ఫీజుల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని ఎక్సైజ్శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి గతంలో కంటే ఈ రెండేళ్లలో మద్యంపై పెద్ద మొత్తంలో లాభాలు వచ్చాయి. జంటనగరాల్లో రోజుకు 25 నుంచి 30 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నట్టు సమాచారం. అంటే నెలకు 75 కోట్ల రూపాయలు వ్యాపారం, ఏడాదికి దాదాపు 900 కోట్ల రూపాయల నుంచి వెయ్యి కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.
దుకాణాల కోసం పెరగనున్న పోటీ..! డ్రా విధానంతో కేటాయింపులు..!!
ఇవి కాకుండా మద్యం వ్యాపారుల నుంచి వసూలుచేసే లైసెన్స్ పీజుల నుంచి కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఈసారి కూడా షాపుల కేటాయింపు, లైసెన్స్ ఫీజులను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. జంటనగరాల్లో మద్యం దుకాణాల కోసం ఈసారి పోటీ పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. ఒక్కో దుకాణానికి ఇద్దరు నుంచి ముగ్గురు పోటీపడుతున్నారు. బాగా వ్యాపారం జరిగే ప్రాంతాల్లో పోటీ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. గతంలో వేలం వేస్తే ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారికి షాపులను కేటాయించేవారు. మారిన విధానంలో ఒక దుకాణానికి ముందే ధర నిర్ణయిస్తారు. ఈ ధరకు లైసెన్స్ తీసుకునే వారు ఎక్కువమంది ఉంటే లాటరీ పద్ధతిలో వారికి షాపు కేటాయిస్తారు. గతంలో వేలం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తే ఈసారి లైసెన్స్ ఫీజును పెంచడం ద్వారా మరింత అధిక ఆదాయాన్ని పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
లైసెన్స్ ఫీజు పెరిగే అవకాశం..! ఐనా వ్యాపారుల్లో తగ్గని జోరు..!!
శివారులోని పంచాయతీలు, మునిసిపాలిటీల పరిధిలో లైసెన్స్ ఫీజును ఏడాదికి 45 లక్షలు రూపాయలుగా నిర్ణయించారు. తాజాగా శివారు ప్రాంతాల్లోని మునిసిపాలిటీలు, పంచాయతీలను కార్పొరేషన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజులు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. వీటితోపాటు దుకాణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగానే శివారు ప్రాంతాలు, జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజులు పెరుగుతాయని కూడా చర్చ జరుగుతోంది.