క్షణాల్లో సెక్రటేరియట్ కూల్చివేతకు రంగం సిద్ధం .. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం ఖర్చు ఎంతంటే ?
టీఆర్ ఎస్ అధినేత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సెక్రటేరియట్ , అసెంబ్లీ భవనాల నిర్మాణానికి శ్రీ కారం చుట్టారు. ఈ నేపధ్యంలో పాత భవనాల కూల్చివేత నిర్వహించనున్నారు. కంట్రోల్ బ్లాస్టింగ్ పద్దతిలో కూల్చివేత చెయ్యాలని అధికారులు నిర్ణయించారు.ఎర్రమంజిల్ ప్యాలెస్ స్థానంలో అసెంబ్లీని నిర్మించి.. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ భవనాలను కూల్చివేసి, వాటి స్థానంలోనే నూతన సచివాలయాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అయితే ఎర్రమంజిల్ కూల్చివేతపై హైకోర్టు తాము చెప్పే వరకు కూల్చివేత ఆలోచన విరమించుకోవాలని ఆదేశించింది.
సెక్రటేరియట్ భవనాల కూల్చివేతకు ప్రభుత్వం కసరత్తు.. క్షణాల్లో నేలమట్టం చేసే ఆలోచన
ఇక ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ భవనాల కూల్చివేతకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చివేతను ఆపాలని స్టే విధించింది. అయితే సెక్రటేరియట్ భవనాన్ని మాత్రం వీలైనంత త్వరగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాత సచివాలయాన్ని ఖాళీ చేసి, సమీపంలోని బీఆర్కే భవన్ నుంచి విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం పూర్తిగా ఖాళీ అయిన సెక్రటేరియట్ భవనాలను కూల్చివేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని భావిస్తోంది. కూలీలు, జేసీబీల ద్వారా కూల్చివేతకు చాలా సమయం పడుతుంది. అంతే కాకుండా అలా కూల్చివేస్తే దుమ్ము ధూళితో ఈ ప్రాంతం చాలా కాలంపాటు ఇబ్బందులు పడాలి . బాంబులను వినియోగిస్తే.. పక్కన ఉన్న భవనాలకు నష్టం వాటిల్లుతుంది.
ఇంప్లోజన్ పద్దతిలో కూల్చివేత నిర్ణయం .. 15 సెకన్లలోనే కూల్చివేత ..10కోట్లు ఖర్చు
దీంతో బిల్డింగ్ ఇంప్లోజన్ అనే ఆధునిక సాంకేతిక పద్ధతిలో సెక్రటేరియట్ భవనాలను కూల్చివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఈ విధానం అత్యంత ఖర్చుతో కూడుకున్న విధానం . ఈ విధానంలో భారీ భవనాలను కేవలం నిమిషంలో నాలుగో వంతులోనే నేలమట్టం చేయవచ్చు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా సచివాలయానికి చుట్టుపక్కల ఉన్న భవనాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా భవనం ఉన్న స్థలంలోనే క్షణాల్లోనే ఎంతటి భవనం అయినా కుప్ప కూలుతుంది . కానీ, భవనం కూలిన వెంటనే భారీ స్థాయిలో దుమ్మూ, ధూళి చెలరేగుతాయి. ఇంప్లోజన్ విధానంలో భవనాల కూల్చివేత ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది. సచివాలయ ప్రాంగణంలో 11 బ్లాక్స్ ఉన్నాయి. వీటిని ఇంప్లోజన్ విధానంలో 15 సెకన్లలోనే కూల్చివేయడానికి సుమారు రూ. 10 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది.
ప్రతిపక్షాలు వద్దన్నా కేసీఆర్ అనుకున్నదే చేస్తున్న కేసీఆర్ .. మొదట త్రీడి చిత్రీకరణ ద్వారా పరిశీలన
ఇక సెక్రటేరియట్ భవనాన్ని కూల్చివేయటానికి ఈ విధానం అమలు చేసే సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మొదట త్రీడి చిత్రీకరణ ద్వారా పరిశీలించి, ఆ తర్వాత అమలు చేయాలని భావిస్తున్నారు. ఇక ప్రతిపక్షాలు పాత సచివాలయ భవనాన్ని కూల్చివెయ్యొద్దని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చెయ్యొద్దని గగ్గోలు పెడుతున్నా సీఎం కేసీఆర్ మాత్రం తనపని తాను చేసుకుపోతున్నారు. పాత సచివాలయ భవనాన్ని కూల్చి వెయ్యాలని నిర్ణయం తీసుకున్న కేసీఆర్ త్వరితగతిన కూల్చివేత నిర్వహించాలని సూచించారు. . ఇక ఈ ఇంప్లోజన్ పద్దతిలో భవంతుల పునాదుల నుంచి అన్ని అంతస్తుల పిల్లర్లను డ్రిల్ చేసి, డైనమైట్లను అమర్చి, వాటిని ఓ క్రమ పద్ధతిలో పేల్చడం ద్వారా, భవంతిని కూల్చివేస్తారు. ఈ పద్ధతిలో చుట్టుపక్కల ఉన్న ఇతర భవనాలకు ఏ విధమైన నష్టమూ కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ పద్ధతి ద్వారా కూల్చివేత పని త్వరగా పూర్తి కావటమే కాకుండా ఇతర భవనాలకు హాని ఉండదు. ప్రస్తుతం సచివాలయంలో దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలున్నాయి. ఒక్కో భవనం ఒక్కో బ్లాకుగా మొత్తం పదకొండు భవనాలున్నాయి. వీటన్నింటినీ ఇదే విధానంతో కూల్చి వెయ్యనున్నారు.