కరోనా భయంలో తెలంగాణా సెక్రటేరియట్ ఉద్యోగులు .. బిక్కుబిక్కుమంటూ విధులు
తెలంగాణా రాష్ట్ర సెక్రటేరియట్ ఉద్యోగులు కరోనా భయంతో వణికిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కార్యాకలాపాలు కొనసాగుతున్న వేళ కరోనా జాగ్రత్తలు తీసుకోవటానికి తెలంగాణా సెక్రటేరియట్ ఉద్యోగులకు వీలు కావటం లేదు. మాస్కులు, గ్లౌజులు ధరించినా సామాజిక దూరం పాటించటం ఆఫీసులో సాధ్యం కాక కరోనా టెన్షన్ తో తెగ ఇబ్బంది పడుతున్నారు. ఇంత మందిని ఒకే భవనంలో వద్దు మహా ప్రభో కరుణించండి అంటూ ప్రాధేయపడుతున్నారు.
కరోనా రహిత గ్రామాలే లక్ష్యంగా తెలంగాణా సర్కార్ సర్వే.. ఇంటింటికీ జ్వరపరీక్షలు చేసి వివరాల సేకరణ
కొత్త సెక్రటేరియట్ నిర్మాణం నేపధ్యంలో బీఆర్కే భవనంలో సెక్రటేరియట్
టీఆర్ ఎస్ అధినేత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణా రాష్ట్రంలో కొత్త సెక్రటేరియట్ , కొత్త అసెంబ్లీ భవనాలనిర్మాణానికి శ్రీ కారం చుట్టిన విషయం తెలిసిందే . ఇక ఈ క్రమంలో పాత సెక్రటేరియట్ లోని చాలా శాఖలను బీఆర్కే భవనంలోకి తరలించారు. అయితే ఒకే హాల్ లో చాలా శాఖలకు సంబంధించిన ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇరుకుగా ఉన్న కొంత కాలం సర్దుకుందామని భావించిన సెక్రటేరియట్ ఉద్యోగులకు కరోనా ఇబ్బందికర పరిస్థితులను తెచ్చి పెట్టింది.
బీఆర్కే భవన్ లో స్థలాభావం ... సాధ్యం కాని సోషల్ డిస్టెన్స్
సెక్రటేరియట్ లో అన్ని కరోనా జాగ్రత్తలు పాటించినా సోషల్ డిస్టెన్స్ మాత్రం సాధ్యం కావటం లేదు . పని చేస్తున్న ఉద్యోగులకు ఒక్కొక్కరికి మధ్య కనీసం రెండు అడుగుల దూరం కూడా ఉండటం లేదు .ఇది అక్కడ ఉద్యోగులకు కరోనా వస్తుందేమో అన్న భయం కలిగిస్తుంది. ఇక ప్రభుత్వ సెక్రటేరియట్ శాఖలను బీఆర్కే భవన్కు తరలించినప్పటి నుంచి ఉద్యోగులు అసంతృప్తి తోనే ఉన్నారు. అక్కడ కావాల్సినంత స్థలం లేక పోవడం, ఇరుకు గదుల్లో పని చెయ్యాల్సి రావటం ప్రధాన కారణం.
ఒకరికి కరోనా వచ్చినా అందరికీ కరోనా పాకే అవకాశం
ఇక ఇప్పుడు కరోనా కాలం కావడంతో సెక్రటేరియట్ ఉద్యోగుల ఆందోళన మరింత రెట్టింపు అయింది. ఇది ఇప్పట్లో వదిలే వ్యవహారంలా కనిపించడం లేదనే భావన ఉంది . దాని బారిన పడకుండా ఉద్యోగం చెయ్యటం , ప్రభుత్వ కార్యకలాపాలు నడపటం ఇప్పుడు కత్తి మీద సామే . గతంలో ఒక్క ఫ్లోర్ లో ఉన్న అన్ని సెక్షన్లనూ ప్రస్తుతం ఒకే హాల్ లో ఉంచి పని చేయిస్తున్నారు. ఎవరికైనా ఒకరికి కరోనా వస్తే అది అందరికీ పాకే ప్రమాదం ఉంది.
సేఫ్ జోన్ లో లేని సెక్రటేరియట్ ఉద్యోగులు .. కొన్ని శాఖలను వేరే భవనాల్లోకి తరలించాలని వినతి
అంతేకాకుండా సెక్రటేరియట్ లో చేస్తున్న ధర్మల్ స్క్రీనింగ్ కూడా సరిగా పని చెయ్యటం లేదు. ఇక అక్కడ జరుగుతున్న సివిల్ నిర్మాణ పనుల కారణంగా కార్మికులు ఎలాంటి జాగ్రత్తలు లేకుండా తిరుగుతున్నారు. దీంతో తాము సేఫ్ జోన్ లో లేమని తెగ బాధ పడుతున్నారు సెక్రటేరియట్ ఉద్యోగులు . ఎలాగైనా సరే భవనాలకు కొన్ని శాఖలను తరలించాలని కోరుతున్నారు. సామాజిక దూరం పాటించాలని చెప్తున్న ప్రభుత్వం సెక్రటేరియట్ ఉద్యోగుల విషయంలో సామాజిక దూరం పాటించేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కొన్ని శాఖలను అయినా తరలించాలని కోరుతున్నారు.