సెక్రటేరియట్పై కేసీఆర్కు షాకింగ్ ప్రశ్న!: ఆ విషయాన్ని పట్టించుకుని ఉంటే!..
గ్రీనరీని కేసీఆర్ విస్మరిస్తున్నారనడానికి సెక్రటేరిట్ తరలింపే నిదర్శనం అంటున్నారు.గడిచిన కొన్నిరోజుల్లో గ్రీనరీ వల్లే హైదరాబాద్ లో రెండు శాతం మేర ఉష్ణోగ్రతలు తగ్గాయన్న సంగతి ఆయన గుర్తెరగట్లేదన్న వాదన
హైదరాబాద్: శాస్త్రీయత కన్నా వ్యక్తిగత విశ్వాసాలకు.. ఇంకా చెప్పాలంటే పచ్చి మూఢనమ్మకాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడ లేని ప్రాధాన్యం ఇస్తున్నారని జాతీయ మీడియా సైతం ఆయన్ను విమర్శిస్తోంది. సెక్రటేరియట్ విషయంలో ఆయన అనుసరిస్తున్న పంథా ఈ రకమైన విమర్శలకు తావిస్తోంది.
సకల సౌకర్యాలతో కూడిన సెక్రటేరియట్ ను కాదనకుని, ఉన్నపళంగా కొత్త సెక్రటేరియట్ నిర్మించాలనుకోవడం.. కేవలం కేసీఆర్ 'వాస్తు' నమ్మకమే తప్పితే మరొకటి కాదని కుండ బద్దలు కొడుతోంది. పోనీ.. ఇప్పుడున్న సెక్రటేరియట్ ఏమైనా పాతబడిపోయిందా? అంటే.. అసలు కొన్ని భవనాలు నిర్మించి ఇంకా పదేళ్లు కూడా పూర్తవలేదు.
కేసీఆర్ సచివాలయ స్వప్నానికి 'ఖేల్ ఖతం': జింఖానా క్రీడాకారుల ఆవేదన.
దానికి తోడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలాగూ ఇక్కడినుంచి మకాం మార్చివేశారు. ఈ లెక్కన అది కూడా తెలంగాణ ప్రభుత్వమే వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. చంద్రబాబు ఇక్కడి నుంచి మకాం మార్చడానికి కొన్నిరోజుల ముందే.. కోట్ల రూపాయల వ్యయంతో ఏపీకి కేటాయించిన సెక్రటేరియట్ కు మరమ్మత్తులు కూడా జరిపించారు. అలాంటప్పుడు.. ఇంకా కొత్త సెక్రటేరియట్ నిర్మాణం అవసరం ఏముందన్నది ప్రస్తుతం అందరిలోను వ్యక్తమవుతోన్న ప్రశ్న.
ఓవైపు ఎండలు దంచికొడుతుంటే:
కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన రోజే.. అంటే, మే24వ తేదీన యాథృచ్చికంగా నగరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజానికి ఈ ఉష్ణోగ్రతలను గనుక సీఎం కేసీఆర్ దృష్టిలో పెట్టుకుని ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండకపోయేవారన్న వాదన వినిపిస్తోంది.
అంతలా ఎండలు మండిపోతున్న తరుణంలో.. జింఖానా(23ఎకరాలు), బైసన్ పోలో(37.5ఎకరాలు) మైదానాల్లో సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టడమంటే.. గ్రీనరీకి తూట్లు పొడవడమే అనేది పలువురి అభిప్రాయం. కాగా, కేసీఆర్ సెక్రటేరియట్ పై తన నిర్ణయం ప్రకటించిన రోజు.. అత్యధికంగా 43.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలోనే ఇది అత్యధిక ఉష్ణోగ్రత అని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
తరలించాల్సిన అవసరమేముంది?:
నిజానికి సెక్రటేరియట్ ను తరలించాల్సిన అవసరమేముందనేది ప్రస్తుతం చాలామంది వ్యక్తం చేస్తున్న ప్రశ్న. ప్రభుత్వం మాత్రం అన్ని కార్యాలయాలు ఒకే గొడుగు కిందకు తెచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెబుతోంది. అదే సమయంలో.. ఎలాగూ ఏపీ సీఎం సహా అక్కడి ఉద్యోగులంతా తరలిపోయారు కాబట్టి.. వారు ఖాళీ చేసిన భవనాలను ఇందుకోసం ఉపయోగించుకోవచ్చనేది పలువురి వాదన. వీటన్నింటి కంటే.. కేసీఆర్ కు వాస్తు పట్ల ఉన్న మూఢనమ్మకమే.. ఆయన్ను ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందని స్పష్టంగా అర్థమవుతోంది.
మరో 50ఏళ్లు మనగలిగే భవనాలను కాదని!:
ఇప్పుడు సెక్రటేరియట్ లోని భవనాలు మరో 50ఏళ్ల వరకు ఉపయోగపడుతాయని వాతావరణ నిపుణులు ప్రసన్న కుమార్ అభిప్రాయపడుతున్నారు. అందులోను.. నిర్మాణం జరిగి పదేళ్లు కూడా పూర్తవని భవనాలు చాలానే ఉన్నట్లు చెబుతున్నారు. అదీగాక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఇక్కడి నుంచి విజయవాడకు వెళ్లిపోయే ముందు కోట్ల రూపాయాల ఖర్చుతో కొన్ని బ్లాక్స్ కు మరమ్మత్తులు చేయించారు. ఏపీ సీఎం ఖాళీ చేసేయడంతో ఇప్పుడా భవనాలు తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకోవడానికి అవకాశం ఏర్పడింది.
వాస్తు కారణంతోనే ప్రగతి భవన్:
ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ లో వాస్తు దోషాలు ఉన్నందువల్ల.. అక్కడి నుంచి తన కార్యాచరణ అమలు చేయడం కలిసిరాదని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. క్యాంప్ ఆఫీస్ స్థలంలో ప్రగతి భవన్ నిర్మించడానికి కూడా వాస్తు కారణమే అని చెబుతున్నారు. ఎంతమంది వాస్తును గుడ్డిగా కొట్టిపారేసినా.. కేసీఆర్ మాత్రం వాస్తును బలంగా నమ్ముతూ రావడమే ఈ కొత్త భవనాల నిర్మాణానికి కారణమంటున్నారు.
స్వయంగా కేసీఆర్ చెప్పారు:
మార్చి,2015 లో సీఎం కేసీఆర్ స్వయంగా సెక్రటేరియట్ లో వాస్తు దోషం గురించి చెప్పారు. సెక్రటేరియట్ లో వాస్తు దోషాలు ఉండటం వల్లే.. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ది సరిగా జరగలేదని, అలాంటి ప్రభావం తెలంగాణపై పడవద్దనే కొత్త సెక్రటేరియట్ నిర్మాణం చేపడుతున్నామని ఆనాడు సీఎం ప్రకటించారు.
పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బ్యూరో క్రాట్ కేసీఆర్ గురించి ఈవిధంగా అభిప్రాయపడ్డారు. 'రాజులు ఎప్పటికీ కొత్తవి సృష్టించడానికి తహతహలాడుతుంటారు. కేసీఆర్ విషయంలోను ఇదే ఫ్యూడల్ మైండ్ సెట్ కనిపిస్తోంది. అందుకే నా సెక్రటేరియట్ అన్న ధోరణిలో ఆయన వ్యవహరిస్తున్నారు' అని పేర్కొన్నారు.
కేసీఆర్ ఆ విషయం గ్రహించట్లేదు:
గ్రీనరీని కేసీఆర్ విస్మరిస్తున్నారనడానికి సెక్రటేరిట్ తరలింపే నిదర్శనం అంటున్నారు.గడిచిన కొన్నిరోజుల్లో గ్రీనరీ వల్లే హైదరాబాద్ లో రెండు శాతం మేర ఉష్ణోగ్రతలు తగ్గాయన్న సంగతి ఆయన గుర్తెరగట్లేదన్న వాదన వినిపిస్తోంది. ఒకవిధంగా ఈ చర్య వాతావరణంతో అడ్వెంచర్ స్పోర్ట్ ఆడుకోవడం లాంటిదేనని రవిచందర్ అనే హైదరాబాదీ లాయర్ అభిప్రాయపడటం గమనార్హం. మానవ చర్యలేవి గ్రీనరీకి విఘాతం కలిగించవద్దని ఆయన పేర్కొన్నారు.