రేవంత్ ఉక్కిరి బిక్కిరి- పెరుగుతున్న అసమ్మతి : నేడు కీలక పీఏసీ భేటీ-వారంతా ఒక్కటిగా..!!
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కోవటం కంటే..సొంత పార్టీలోని సీనియర్లను సముదాయించటం ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ సమర్ధతకు పరీక్షగా మారింది. రేవంత్ ను పీసీసీ చీఫ్ గా నియామకం చేసినప్పటి నుంచి కొందరు ఓపెన్ గా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే..మరి కొందరు అవకాశం చూసి బయట పడుతున్నారు. పార్టీలో రేవంత్ అనుకూల - రేవంత్ వ్యతిరేక అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. పార్టీ పరిస్థితి ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా మారింది. పార్టీలోని కొందరు సీనియర్లు, రేవంత్ నియామకాన్ని వ్యతిరేకించిన మరికొందరితో రేవంత్, ఆయన టీంకు చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది.
రేవంత్ చెప్పిన మాటలు ఏమయ్యాయి
సీనియర్ల మాటలను పరిగణనలోకి తీసుకుంటానని అంటూనే రేవంత్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇది సీనియర్లకు నచ్చటం లేదు. తాజాగా జగ్గారెడ్డి పార్టీ సీనియర్ల ఎదుటే రేవంత్ తీరు పైన మండిపడ్డారు. సీతక్క మినహా ఎమ్మెల్యేలు, ఉన్న ఒక్క ఎమ్మెల్సీతో పాటు పలువురు సీనియర్ నాయకులు.. టీపీసీసీ అధ్యక్షుడి తీరుపై అసంతృప్తితో ఉన్నారనే వాదన వినిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ బాధ్యతల స్వీకరణకు ముందు రేవంత్ చెప్పిన మాటలకు..ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన ఉండటం లేదని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
తన మద్దతు దారులకే ప్రాధాన్యత
ముఖ్యంగా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమ నిర్వహణ సీనియర్లు వర్సెస్ రేవంత్ అన్నట్లుగా సాగింది. ఇంద్రవెల్లి సభకు ముందు మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అలకతో ప్రారంభమైన పంచాయతీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇంద్రవెల్లి సభకు సీతక్క అధ్యక్షత వహించడం, రావిర్యాల సభను అంతా రేవంత్ టీం నడిపించడం, మూడుచింతలపల్లి దళిత దీక్షలో కూడా సీనియర్లు తెరపైన కనిపించే పరిస్థితి లేకపోవడం, గజ్వేల్ సభ అంతా రేవంత్ అన్నట్లే సాగడాన్ని ఆయన వ్యతిరేక వర్గం జీర్ణించుకోలేక పోతోంది.
సీనియర్లను పరిగణలోకి తీసుకోవటం లేదా
కనీసం పార్టీలో చర్చించకుండానే గజ్వేల్ సభలో 2 నెలల పాటు నిరుద్యోగ సమస్యపై కార్యాచరణ ప్రకటించడం దేనికి సంకేతమని, అన్నీ ఆయనే ప్రకటిస్తే ఇక తాముండి ఎందుకనే భావన రాష్ట్ర కాంగ్రెస్ సీని యర్ నాయకుల్లో వ్యక్తమవుతోంది. కనీసం పార్టీ సీనియర్లతో చర్చించకుండానే అధికార ప్రతినిధుల నియామక పేర్లు ప్రకటించడం, గాంధీభవన్లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఎవరెవరు వస్తున్నారనే సమాచారం కూడా ముఖ్య నేతలకు ఇవ్వకపోవడం లాంటివి రేవంత్ ఏకపక్ష ధోరణి అంటూ విమర్శలకు కారణమవుతున్నాయి.
రేవంత్ కు మద్దతుగా ఢిల్లీ నేతలు
మొదటి నుంచీ అండగా ఉన్న నేతలు రేవంత్కు కవచంగా పనిచేస్తూ అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. సీనియర్ల వ్యవ హారశైలిని ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నాలూ చేస్తున్నారు. సీనియర్లతో మాట్లాడినా, మాట్లాడకపోయినా రేవంత్ నుంచి వచ్చే ప్రతి పిలు పును విజయవంతం చేసే పనిలో వారు నిమ గ్నమైపోయారు. సీనియర్లు.. సీనియర్లు.. అం టూ ఏడేళ్లుగా పార్టీని పాతాళంలోకి తొక్కేశారని, రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్లో కొత్త ఊపు వస్తే దాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని వారంటున్నారు.
Recommended Video
ఢిల్లీ కంట్రోల్ చేస్తుందా..పీఏసీలో ఏం జరుగుతుంది
సీనియర్లు కొందరిని ఉసిగొల్పుతున్నారని, అధిష్టానం స్పష్టంగా చెప్పినా వారి వైఖరిలో మార్పురావడం లేదని పేర్కొంటున్నారు. రేవంత్ కూడా సమ యానికి అనుగుణంగా తన కార్యచరణను ముందుగానే ప్రకటించేస్తున్నారు. ఇదిలాఉంటే పార్టీ అధిష్టానం కూడా రేవంత్ను సమర్థించే రీతిలోనే వెళ్తోంది. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మాణిక్యం ఠాగూర్ అన్ని విషయాల్లోనూ టీపీసీసీ అధ్యక్షుడికి అండగా నిలబడుతున్నారు. దీనికి తోడు రేవంత్కు సహకరించాల్సిందేనంటూ ముఖ్యనేతలందరికీ అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనేటి పీఏసీ భేటీకి ఎవరెవరు వస్తారు.. ఏం జరుగుతుంది.. అనేది కాంగ్రెస్ లో ఉత్కంఠకు కారణమవుతోంది.