డేటా చోరీ: జార్జియాలో ఇలాగే జరిగింది.. ఓట్లు తొలగించి గెలిచారు! ఏపీలో ఇలా ఓట్లు తొలగింపు!!
హైదరాబాద్: డేటా చోరీ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజేసింది. ఈ అంశంపై ఏపీకి చెందిన లోకేశ్వర్ రెడ్డి, దశరథరామిరెడ్డిలు సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధులలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుల్లో ఒకరైన దశరథరామిరెడ్డి తన ఫిర్యాదులో.. అమెరికాలోని జార్జియాలో గత ఏడాది గవర్నర్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఏపీలో జరిగినట్లుగానే జరిగిందని పేర్కొన్నారు.
షాకింగ్: 'వైయస్ వివేకానంద ఓటు తొలగించిందే జగన్, ఎందుకంటే, ఫారం 7 విషయంలోనూ..'
జార్జియాలో ఇలాగే జరిగింది
ఇప్పుడు ఏపీలో జరుగుతున్నట్లుగానే గతంలో జార్జియాలో జరిగిందంటూ అందుకు సంబంధించిన కాపీలను పోలీసులకు సమర్పించారు. ఈ విషయాన్ని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. పోలింగ్కు ముందు నల్లజాతీయులైన 3.40 లక్షల మంది ఓటర్లను తొలగించడంతో కెంప్ గెలిచినట్టు ఫిర్యాదిదారు తమకు వివరించినట్లు చెప్పారు.
ఐటీ గ్రిడ్ కలకలం.. సిట్ ఏర్పాటు
ఐటీ గ్రిడ్ సంస్థ వ్యవహారం కలకలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఆ సంస్థ రూపొందించిన సేవామిత్ర యాప్ ప్రకంపనలు బుధవారం తార స్థాయికి చేరుకున్నాయి. సేవామిత్ర యాప్ ద్వారా ఓటర్లను తొలగిస్తున్న అంశం తమ దృష్టికి వచ్చిందని హైదరాబాద్ పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఐటీ గ్రిడ్స్, సేవామిత్ర యాప్లపై సమగ్ర విచారణ చేపట్టేందుకు సిట్ను ఏర్పాటు చేసింది. వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర సారథ్యంలో కామారెడ్డి ఎస్పీ ఎన్ శ్వేత, సైబరాబాద్ డీసీపీ (క్రైం) రోహిణి ప్రియదర్శిని, నారాయణపేట డీఎస్పీ జి శ్రీధర్, సైబరాబాద్ సైబర్ నేరాల డీఎస్పీ బి రవికుమార్ రెడ్డి, మాదాపూర్ ఏసీపీ ఎన్ శ్యామ్ ప్రసాదరావు, సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ వై శ్రీనివాస్, హైదరాబాద్ సీసీఎస్ సైబర్నేరాల సీఐ బి రమేష్, జి వెంకటరామి రెడ్డిలు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. మాదాపూర్తోపాటు ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన అన్ని కేసులను సిట్ దర్యాప్తు చేస్తుంది. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లతోపాటు సీఐడీ విభాగం కూడా ఇందుకు సహకరించాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది ఉత్తర్వులు జారీ చేశారు.
ఇలా ఓట్లు తొలగించారు
సేవామిత్ర మొబైల్ అప్లికేషన్ ద్వారా ఐటీ గ్రిడ్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ ఏపీలో సర్వే నిర్వహించి వందలమంది ఓట్లు తొలగించి ఉంటారన్న అనుమానాలున్నాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. అది నలుగురు ఓటర్లను తొలగించినట్టు వెలుగులోకి రావడం ద్వారా నేరపూరిత చర్యలకు పాల్పడుతోందని తెలుస్తోందన్నారు. హైదరాబాద్ మధురానగర్ వాసి జి దశరథరామి రెడ్డి ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 2వ తేదీన కేసు నమోదు చేసుకున్నామని, సేవామిత్ర యాప్ను రూపొందించిన ఐటీ గ్రిడ్ సంస్థ ఏపీలోని 175 నియోజకవర్గాల్లో సర్వే పేరుతో వ్యక్తిగతంగా, ఫోన్ ద్వారా ఓటర్ల నుంచి సమాచారం సేకరిస్తోందని, ఓటర్లు ఏ పార్టీకి చెందినవారు? వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారు? అనే అంశాలను తెలుసుకుంటున్నారని, ఇందుకు ఈ సంస్థ ఒక ప్రశ్నావళిని రూపొందించిందని చెప్పారు. ఓటర్లు నియోజకవర్గం పరిధిలో ఉన్నారా? వేరే ప్రాంతాల్లో నివస్తున్నారా? అని తెలుసుకుంటున్నారని, ఏపీలో శాశ్వతంగా నివసిస్తూ ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్న ఓటర్లను జాబితాలో తొలగిస్తున్నారని, నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం, ఆధార్ విభాగానికి తమ నివేదికలను ఇస్తామని చెప్పారు. యాప్లో ఓటు హక్కు కోల్పోయిన వారి వివరాలు సేకరించామని, తమ అనుమానం ప్రకారం వందల సంఖ్యలో ఓట్లు తొలగించి ఉంటారని, ఉదాహరణకు అమీర్పేటలో ఉంటున్న రంగారెడ్డి, ఆయన భార్య విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారని, ప్రస్తుతం ఓటరు జాబితాలో వీరిద్దరి పేర్లు లేవన్నారు.
పలు సెక్షన్ల కింద కేసు
కాగా, ఐటీ గ్రిడ్ సంస్థ నియమించిన సర్వేయర్లు ఓటర్లకు ఫోన్ చేసి ప్రశ్నలు అడుగుతారు. మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు? పార్టీల వారీగా టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీ... ఇలా ఏ పార్టీకి ఎంత రేటింగ్ ఇస్తారు? ఏ పార్టీ అభ్యర్థిని ఎంతమంది బలపరుస్తున్నారు? అని అడుగుతారు. ఆ సమాచారాన్ని బూత్ లెవల్ కన్వీనర్లకు పంపిస్తారు. వారు తమకు తెలిసిన అంశాలను మళ్లీ ఐటీ గ్రిడ్కు పంపిస్తారు. ఆ సమాచారాన్ని క్రోడీకరించాక కీ పర్సన్కు వెళ్తుంది. డాష్ బోర్డ్ కూడా ఉంది. ఈ డాష్ బోర్డ్ ద్వారా ఎవరెవరు ఏం చేయాలో నిర్ణయిస్తారు. సమాచార దుర్వినియోగంపై ఆధారాలు లభించాయని, అందుకే ఐటీ గ్రిడ్ సంస్థ, ప్రతినిధులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.