రిపబ్లిక్ డే: తెలంగాణ శకటానికి రక్షణశాఖ అనుమతి
న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవ పరేడ్లో తెలంగాణ శకటానికి అనుమతి లభించింది. 40 నమూనాలను పరిశీలించిన కేంద్రం 13 శకటాలను ఎంపిక చేసింది. ఇందులో తెలంగాణకు చోటు దక్కింది. అయితే రక్షణ శాఖ తొలి జాబితాలో చోటు దక్కకపోవడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీలను కలిసిన టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు జితేందర్రెడ్డి తెలంగాణ శకటానికి అనుమతివ్వాలని కోరారు.
సానుకూలంగా స్పందించిన రక్షణ శాఖ తెలంగాణ రాష్ట్ర శకటానికి అనుమతినిచ్చింది. ఈ సందర్భంగా కేంద్రానికి ఎంపి జితేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
డెహ్రాడూన్ మిలిటరీ కళాశాలలో తెలంగాణకు కోటా
డెహ్రాడూన్ మిలిటరీ కళాశాలలో తెలంగాణ రాష్ర్టానికి కోటా కేటాయించాలని టిఆర్ఎస్ ఎంపి జితేందర్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి కేంద్ర రక్షణ శాఖ సానుకూలంగా స్పందించింది. డెహ్రాడూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కళాశాలలో తెలంగాణకు ఒక సీటు కేటాయిస్తూ రక్షణ శాఖ జితేందర్రెడ్డికి లేఖ రాసింది.
ఈ మిలిటరీ కళాశాలలో ఎనిమిదవ తరగతిలో చేరడానికి ప్రతి రాష్ర్టానికి ఒక సీటును రక్షణ శాఖ కేటాయిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రెండు సీట్లు ఉండేవి.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో ఒక సీటు కేటాయించాలని జితేందర్రెడ్డి కేంద్ర రక్షణ శాఖకు లేఖ రాసి, స్వయంగా రక్షణ మంత్రిని కలిశారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీలకు చెరొక డెహ్రాడూన్ కళాశాలలో 8వ తరగతిలో చేరడానికి దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అవకాశం లభిస్తుంది.