తెలంగాణ నుంచి రూ.లక్షకోట్లు రావాలి: బాబు సంచలనం, లోకసభ ఎన్నికల్లో పోటీపై ఏమన్నారంటే
అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి రూ. లక్ష కోట్లు రావాలని హాట్ కామెంట్స్ చేశారు. ఆస్తులు, భవంతులు.. ఇలా అన్ని కలిపి మనకు పెద్ద మొత్తంలో తెలంగాణ నుంచి రావాలని చెప్పారు.
ఎన్నికలు: ఈనాడు పేపర్, నాగార్జున, కేసీఆర్, జగన్, చంద్రబాబులకు మోడీ విజ్ఞప్తి
రూ.500, రూ.100 కోట్లు ఇచ్చి చక్రం తిప్పాలని కేసీఆర్ ప్లాన్
కానీ వైసీపీ అధినేత జగన్ను అడ్డుపెట్టుకొని కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఏపీకి రూ.500 కోట్ల సాయం చేద్దామని కేసీఆర్ భావించారని గతంలో చెప్పారని, ఇప్పుడు జగన్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు రూ.వెయ్యి, రూ.2వేల కోట్లు ఇస్తున్నారని, ఇలా ఇచ్చి ఏపీలో చక్రం తిప్పుదామని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. తద్వారా మనకు రావాల్సిన లక్ష కోట్లను ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. ఏపీలో టీడీపీ వంటి సరైన ప్రభుత్వం ఉంటే తమకు నష్టమని కేసీఆర్ భావిస్తున్నారని, అందుకే జగన్ను గెలిపించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తనను దెబ్బతీసేందుకే కేసీఆర్, మోడీ, జగన్ కలిసి తొలి విడతలో (ఏప్రిల్ 11) ఎన్నికలు నిర్వహిస్తున్నారని, కానీ దీనిని తాను అవకాశంగా మలుచుకుంటానన్నారు.
ఏపీలో తెరాస ప్రభుత్వం ప్రచారం
జగన్ చేసిన వందల ఎకరాల ఆక్రమణలు కేసీఆర్కు కనిపించడం లేదని ఆని చంద్రబాబు నిలదీశారు. తమ పార్టీ డేటా దొంగిలించి తిరిగి మమ్మల్నే బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తమ పార్టీ డేటా దొంగిలించి అడ్డంగా దొరికిపోయారని తెరాసపై నిప్పులు చెరిగారు. ఏపీ ప్రయోజనాలకు కేసీఆర్ అడ్డుపడుతున్నారని, రాష్ట్ర ప్రజల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెరాస ప్రభుత్వం ఏపీలో ప్రచారం చేస్తోందని, జగన్కు ఓటేస్తే కేసీఆర్కు ఆయన ఊడిగం చేస్తారన్నారు.
కేసీఆర్ ఇలా చేయగలవా?
మన శ్రమ, త్యాగాలతో తెలంగాణ ధనిక రాష్ట్రం అయిందని చంద్రబాబు అన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కావడానికి కేసీఆర్ చేసిందేమీ లేదని చెప్పారు. ఏపీ అభివృద్ధి చెందాలని ఉంటే కేసీఆర్.. ప్రత్యేక హోదాపై లేఖ రాయగలరా, పోలవరంపై అభ్యంతరాలు పెట్టడం మానేస్తారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ జుత్తు తన చేతిలో పెట్టుకొని ఏపీపై కేసీఆర్ కక్ష సాధించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
తెలంగాణలో లోకసభ ఎన్నికల్లో పోటీపై ఏం చెప్పారంటే?
తెలంగాణలో లోకసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీపై చంద్రబాబు స్పందించారు. తెలంగాణ రాష్ట్ర శాఖనే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. జగన్ అయిదేళ్లయినా ఏపీకి రావడం లేదంటే ఆయనకు ఏపీపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. జగన్ లాంటి నేరస్తుడికి ఏపీలో చోటు లేదన్నారు. తప్పుడు పనులు చేసేందుకు జగన్కు తెలంగాణ అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. ఈ దొంగలకు బీహార్ డెకాయిట్ పీకే తోడయ్యాడన్నారు. జగన్కు ఓటేస్తే మరణశాసనమే అన్నారు.