జీహెచ్ఎంసీ మినహా అన్ని జిల్లాల్లో ‘పది’ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: సర్కారుపై ఆగ్రహం
హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడిన పదవ తరగతి పరీక్షల నిర్వహణపై శనివారం తెలంగాణ హైకోర్టు స్పష్టతనిచ్చింది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగితా జిల్లాల్లో పరీక్షలను నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో పరీక్షలు వాయిదా
కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశించింది. కరోనా కేసులున్నప్పటికీ పరీక్షలు నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో తగిన జాగ్రత్తలు తీసుకున్నామని, పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. అయితే, హైకోర్టు ఇందుకు అనుమతించలేదు.
విద్యార్థికి కరోనా వచ్చి మరణిస్తే ఎవరిది బాధ్యత?
ప్రస్తుతం పరిస్థితుల్లో కరోనాతో ఎవరైనా విద్యార్థి మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? పరీక్షా కేంద్రాలున్న ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లుగా మారితే ఏం చేస్తారు? అని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టలేమని, పరీక్షల కన్నా విద్యార్థుల జీవితాలే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది.
పరీక్షలు లేకుండా గ్రేడింగ్ ఇస్తే తప్పేంటని..
జీహెచ్ఎంసీ మినహా అన్ని జిల్లాల్లో పరీక్షల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక, పరీక్షలు లేకుండానే గ్రేడింగ్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని హైకోర్టు.. శనివారం ఉదయం విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇతర జిల్లాల్లో పరీక్షలు నిర్వహించుకోవాలని మొదట సూచించింది. రాష్ట్రంలో వేర్వురుగా పరీక్షలు నిర్వహించడం కష్టమని, ప్రశ్నా పత్రాలు మళ్లీ తయారు చేయడం ఇబ్బందని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ కోర్టు తెలిపారు.
విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేదా? అంటూ హైకోర్టు ఆగ్రహం
ఈ క్రమంలో విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా? లేక సాంకేతిక అంశాలు ముఖ్యమా? అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత శనివారం సాయంత్రం విచారణ సందర్భంగా జీహెచ్ఎంసీ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే పది పరీక్షల నిర్వహణకు మార్గం సుగమమైంది. జీహెచ్ఎంసీలో మాత్రం పరీక్షలు వాయిదా పడ్డాయి. కాగా, తెలంగాణలో ఇటీవల ఎక్కువ కరోనా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదువుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తెలంగాణలో 3290 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 113 మంది ప్రాణాలు కోల్పోయారు.