8 తర్వాతే 10 పరీక్షలు: తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ
లాక్డౌన్ తర్వాతే తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టంచేసింది. కరోనా వైరస్ వల్ల మార్చి 24వ తేదీ నుంచి లాక్ డౌన్ విధించడం వల్ల రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు నిలిచిపోయాయి. తెలుగు 1,2, హిందీ పరీక్షలు మాత్రమే జరిగాయి. 3 పరీక్షలు జరగగా.. మిగతా 8 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. దీనిపై విద్యార్థులతోపాటు పేరంట్స్ కూడా ఆందోళన చెందారు.
పదో తరగతి పరీక్షలను నిలిపివేయాలనే పిటిషన్పై మంగళవారం తుది విచారణ చేపట్టారు. పిటిషన్ అత్యవరంగా విచారించాలని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టును వీడియో కాన్పరెన్స్ ద్వారా కోరారు. విచారణ చేపట్టిన ధర్మాసనం.. లాక్ డౌన్ తర్వాతే పరీక్షలు నిర్వహించుకోవాలని స్పష్టంచేసింది.
లాక్ డౌన్ ముగిసాక.. అంటే జూన్ 8 తర్వాత పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది. దేశవ్యాప్తంగా మే 31వ తేదీ వరకు లాక్ డౌన్ 4.0 అమల్లో ఉంది. ఈ క్రమంలో జూన్ 3వ తేదీన పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించి.. 4వ తేదీన తమకు నివేదిక సమర్పించాలని కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పరీక్షలు నిర్వహించే సమయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టంచేసింది. ప్రతీ పరీక్షకు మధ్య రెండురోజుల సమయం ఉండాలని సజెస్ట్ చేసింది. విధిగా భౌతికదూరం పాటించాలని స్పష్టంచేసింది. ఫిజికల్ డిస్టన్స్ పాటించడం వీలుకానీ పరీక్ష కేంద్రాలను మార్చాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.