కెసిఆర్కు లెక్క పంపిస్తా: శ్రవణ్, బాధేస్తోంది: తలసాని రిజైన్పై నాగం
హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల మారణ హోమం జరుగుతుంటే, ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, తాను సీఎం కెసిఆర్కు ఆత్మహత్యల వివరాలు పంపిస్తానని కాంగ్రెస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ కుమార్ సోమవారం మండిపడ్డారు. కేంద్ర నేర నమోదు సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రభుత్వం మోసపూరిత లెక్కలు ఏమిటో అర్థమవుతోందన్నారు.
వెయ్యి మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కెసిఆర్ ప్రభుత్వం కేవలం 90 మందేనని లెక్కలు చెప్పడం దారుణమన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలను ముఖ్యమంత్రి కెసిఆర్కు తాను పంపిస్తానని దాసోజు శ్రవణ్ అన్నారు.
ఆత్మహత్యలు పెరిగాయి: రావుల
తెలంగాణ రాష్ట్రం వచ్చాకే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని టిడిపి నేత రావుల చంద్రశేఖర రెడ్డి సోమవారం అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించే సమయం ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులకు లేదా అన్నారు.
రాష్ట్రంలో 898 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, ఇప్పటి వరకు కెసిఆర్ ఒక్క కుటుంబాన్ని కూడా ఎందుకు పరామర్శించలేదన్నారు. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ కాళ్లు ఫాంహౌస్ దాటడం లేదని ఎద్దేవా చేశారు. ఆత్మహత్యల నివారణకు టిఆర్ఎస్ ఏం చర్యలు తీసుకోవడం లేదన్నారు.
హైదరాబాద్ ముఖ్యమంత్రా: తమ్మినేని
కార్మికుల పట్ల కెసిఆర్ వైఖరి సరిగా లేదని సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. జిహెచ్ఎంసి కార్మికులకు వేతనాలు పెంచి, ఇతర జిల్లాల కార్మికుల గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కెసిఆర్ హైదరాబాదుకే ముఖఅయమంత్రా లేక తెలంగాణకా చెప్పాలన్నారు. కెసిఆర్ వైఖరికి నిరసనగా బస్సుయాత్ర చేపట్టామన్నారు.
బాధేస్తోందన్న నాగం
ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే బాధ కలుగుతోందని బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలకు టిఆర్ఎస్ తిలోదకాలు ఇచ్చిందని మండిపడ్డారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా ఎక్కడకు పోయిందో చెప్పాలన్నారు. స్పీకర్, గవర్నర్ తక్షణమే తలసానిని అనర్హుడిగా ప్రకటించాలన్నారు.