ప్రభుత్వ ఆస్పత్రి: తల్లి చూస్తుండగానే కొడుకు మృతి, హెచ్ఆర్సీ ఆగ్రహం
నల్గొండ: కరోనా విజృంభిస్తున్నవేళ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు లేక పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా, నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో దయనీయమైన స్థితిలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఐసోలేషన్ వార్డులో వార్డులో తల్లి చూస్తుండగానే అతడు తన ప్రాణాలు వదిలాడు.
Recommended Video
తల్లి చూస్తుండగానే..
వివరాల్లోకి వెళితే.. మాడుగులపల్లి మండలం సల్కునూర్కు చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి కోవిడ్ వార్డులో శనివారం చేరాడు. అయితే అప్పటికే పరిస్థితి విషమించిందని వైద్య చేయడానికి డాక్టర్లు ముందుకు రాలేదు. అంతేగాక, ఈ ఆస్పత్రిలో వెంటిలేటర్ సౌకర్యం కూడా లేకపోవడంతో బాధితుడు ఊపిరి తీసుకోలేక తల్లి చూస్తుండగానే ఆమె చేతిలోనే ప్రాణాలు వదిలాడు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా తన కొడుకు చనిపోయాడని ఆ తల్లి ఆరోపించారు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కూడా తన కొడుకును ఏ డాక్టర్ కూడా చూడలేదని వాపోయింది. కొడుకు మృతితో కన్నీరుమున్నీరుగా విలిపించింది ఆ మాతృమూర్తి.
సుమోటాగా స్వీకరించిన తెలంగాణ మానవ హక్కుల సంఘం
కాగా, ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. మీడియాలో ఈ ఘటనకు సంబంధించి వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకుంది. ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టు 21లోగా దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ను మానవ హక్కుల సంఘం ఆదేశించింది.
ఇలాంటి దయనీయ పరిస్థితి ఎక్కడా చూడలేదు..
ఇలాంటి దయనీయమైన స్థితి ఎక్కడా చూడలేదని, మూడు రోజులైనా ఆస్పత్రిలోని కరోనా వార్డుకు ఒక్క వైద్యుడూ రాకపోవడం ఏంటని హెచ్ఆర్సీ ప్రశ్నించింది. ఐసోలేషన్ వార్డుకు ఇతరులు వెళ్లేందుకు అనుమతి లేదు, అలాంటప్పుడు పేషెంట్ తల్లి ఎలా వెళ్లగలిగారని నిలదీసింది. అంతేగాక, ఆమెకు కనీస గ్లౌజులు కూడా లేవని మండిపడింది.
అన్యాయంగా చనిపోయాడు.. ఆస్పత్రికి హెచ్ఆర్సీ సూటి ప్రశ్నలు
అన్యాయంగా అతడు చనిపోయాడని వ్యాఖ్యానించింది. ఆ రోగికి కరోనా పరీక్షలు చేశారా? అని ప్రశ్నించింది. చేస్తే ఎప్పుడు చేశారు? ఫలితం వచ్చిందా? ఒక వేళ ఇంకా కరోనా నిర్ధారణ కాకపోతే ముందు అతడ్ని కరోనా వార్డులో ఎందుకు ఉంచారు? రోగి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ అతనికి ఆక్సిజన్ ఎందుకు పెట్టలేదు అని నల్గొండ ఆస్పత్రి సూపరింటెండెంట్ను మానవ హక్కుల సంఘం సూటి ప్రశ్నించింది.