తెలంగాణ బొగ్గును ఇతర రాష్ట్రాలకు ఇవ్వం: వినోద్ కుమార్, తరలింపు నిలిపివేత!
హైదరాబాద్: జయశంకర్భూ పాలపల్లిలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోసం మాత్రమే స్థానిక తాడిచర్ల సింగరేణి బొగ్గును వినియోగించాలని, ఇక్కడి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. భూపాలపల్లి నుంచి బొగ్గు రవాణా నిలిపివేసినట్లు సమాచారం.
తాడిచర్ల నుంచి బొగ్గు ఇతర రాష్ట్రాలకు తరలించే విషయంలో కేంద్ర ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలు రాష్ట్ర సింగరేణి అధికారులకు మౌఖికంగా ఆదేశించారని వినోద్ కుమార్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో బొగ్గు కొరత ఉందని చెప్పి తాడిచర్ల నుంచి సింగరేణి బొగ్గును తరలించి భూపాలపల్లి విద్యుత్ ఉత్పత్తి కి విఘాతం కలిగిస్తే ఎలా..? అని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాడిచర్ల నుంచి సింగరేణి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించాలన్న ఆలోచనను మానుకోవాలని వినోద్ కుమార్ కేంద్రానికి డిమాండ్ చేశారు.
తెలంగాణకు షాకిచ్చేలా కేంద్ర నిర్ణయం
దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో థర్మల్ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్తు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో ప్రస్తుతం దేశం దృష్టి సింగరేణి మైన్స్ పై పడింది. దేశవ్యాప్తంగా విద్యుత్తుకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో, ఆ డిమాండ్ ను తీర్చడం కోసం బొగ్గు తవ్వకాలను పెంచే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. అయితే దేశం మొత్తం బొగ్గు కొరత ఉన్నా ఒక్క తెలంగాణాలోనే బొగ్గు నిల్వల సమస్య కాస్త తక్కువగా ఉంది. మరో పక్క తెలంగాణా కూడా తమకు విద్యుత్ కొరత లేదని ఇప్పటికే ప్రకటన చేసింది. తెలంగాణలో బొగ్గు గనులు ఉండటంతో బొగ్గు కొరత లేదు. ఈ సమయంలో కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయం తెలంగాణా సింగరేణికి షాక్ ఇచ్చేలా ఉంది.
దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాకుల వేలం పై ఇటీవల కేంద్రం ప్రకటనను విడుదల చేసింది. ఈ వేలం ప్రకటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణాకు ఈ ప్రకటన షాక్ ఇచ్చింది. కేంద్రం ఇటీవల ప్రకటించిన బొగ్గు బ్లాకుల వేలంలో ఇప్పటికే సింగరేణి బొగ్గు లభ్యతపై అన్వేషణ సాగిస్తున్న తెలంగాణా బ్లాకులు కూడా ఉండటం సింగరేణి వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. కోల్ మైన్స్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ 2015, మైన్స్ మరియు మినరల్స్ యాక్ట్ 1957 ప్రకారం బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనిలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, చతిస్గడ్, ఒడిశా, ఝార్ఖండ్ , అస్సాం, రాష్ట్రాల్లోని బ్లాక్ లతో పాటు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన బొగ్గు గనులు ఉన్నాయి.
అయితే కేంద్ర జాబితాలో వేలం వేస్తున్నట్లు ప్రకటించిన బ్లాకులు ప్రస్తుతం సింగరేణి పరిధిలో బొగ్గు అన్వేషణ సాగిస్తున్నాయి. వాటి కోసం సింగరేణి ఇప్పటివరకు నిధులను సైతం ఖర్చు పెట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం బ్లాక్ 3, ఖమ్మం జిల్లా సత్తుపల్లి బ్లాక్ 3, మంచిర్యాల జిల్లా కళ్యాణఖని బ్లాక్ 6, శ్రావణ పల్లి లోని ఓ బ్లాక్ లను వేలం వేయడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం సింగరేణికి షాక్ అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా సోమవరం వెస్ట్ బ్లాక్ కూడా కేంద్రం ప్రకటించిన జాబితాలో ఉండటం గమనార్హం. తెలంగాణలో బొగ్గు లభ్యతపై అన్వేషణ కోసం సింగరేణి ఇప్పటివరకూ చాలా డబ్బు ఖర్చు చేసింది.
కేంద్రం ప్రస్తుతం జాబితా ప్రకటించిన బ్లాక్ ల కోసం కూడా నిధులను ఖర్చు పెట్టింది. సత్తుపల్లి బ్లాక్ 3లో ఎనిమిది కోట్లు, కోయగూడెం ఓసీ 3 లో 18 కోట్లు, శ్రావణ పల్లి లో 20 కోట్లు, మంచిర్యాల కేకే 6 లో 20 కోట్లు ఖర్చు చేసింది. మొత్తంగా ఇప్పటి వరకు 66 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తూ వచ్చింది. అంతేకాదు ఏడాదికి 12 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకొని తెలంగాణ సింగరేణి బొగ్గు అన్వేషణ సాగిస్తోంది.
సింగరేణి పరిధిలో లేని బ్లాకులలో తెలంగాణా సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అన్వేషణ ఎలా సాగించింది? ఇక ఈ విషయం తెలిసి కూడా కేంద్రం ఎలా దీనిని కొనసాగించింది అన్నది ఒక ప్రశ్న. తెలంగాణా సింగరేణి తమ పరిధిలో లేని బ్లాకుల్లో బొగ్గు అన్వేషణ చేస్తున్న సమయంలో ఒకే అన్నట్టు మౌనంగా ఉన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ, ఇప్పుడు దేశం బొగ్గు కొరతలో ఉన్న సమయంలో షాక్ ఇచ్చింది. ప్రస్తుతం కేంద్రం లీజుకు ఇస్తానని ప్రకటించిన బ్లాక్ లు సింగరేణి పరిధిలో లేవని, ఈ కారణంగానే కేంద్రం వేలంలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. బొగ్గు అన్వేషణ సాగించిన సింగరేణికి షాక్ ఇచ్చింది.
లీజ్ నిర్ణయంతో ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధుల మాట అటుంచి వాటిని దక్కించుకోవటం కోసం సింగరేణి కూడా ప్రైవేట్ సంస్థలతో పోటీ పడాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటివరకు సింగరేణి ఈ బ్లాక్ లపై డబ్బు ఖర్చు చేయడంతో, సింగరేణి ఖర్చు చేసిన డబ్బులను వేలం దక్కించుకున్న సంస్థల నుంచి తిరిగి రాబట్టుకోవాల్సి ఉంటుంది. తమ పరిధిలో లేని బ్లాకులపై బొగ్గు అన్వేషణకు డబ్బు ఖర్చు చేసిన సింగరేణి ఒకవేళ లీజ్ లో ఆ బ్లాకులు దక్కించుకోలేకపోతే ప్రైవేట్ సంస్థల నుండి ఆ డబ్బు తిరిగి రాబట్టుకోవాలని సూచించటంపై సింగరేణి వర్గాల్లో చర్చ జరుగుతుంది.