ఆర్టీసీ అభివృద్దికి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం... ఉద్యోగుల సంక్షేమానికి బోర్డు...
ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు కంకణం కట్టుకున్న సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఆర్టీసీలో రవాణా సేవలు విస్తృతం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.. ఈనేపథ్యంలోనే రావాణ వ్యవస్థ మరియు ఆర్టీసీ సంక్షేమంపై అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ప్రజల రవాణాలో ముఖ్యభూమిక పోషిస్తున్న ఆర్టీసీ రవాణాలో కూడ ఇదే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ఆర్టీసీ కార్గో సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఆర్టీసీ కార్గో సేవలు విస్తృతం
ఆర్టీసీలో కార్గో మరియు పార్శిల్ సేవలను విస్తృత పరిచేందుకు అవసరమైన వ్యూహం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించినట్లే, అన్ని చోట్లకూ సరుకు రవాణా చేయాలని చెప్పారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఎంప్లాయిస్ వెల్ఫేర్ బోర్డు కూర్పు దాని పనివిధానాన్ని కూడా సీఎం ఖరారు చేశారు.
ప్రభుత్వ రవాణా ఆర్టీసీకే..
దీంతో అందుకు అనుగుణమైన అంశాలపై సీఎం అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా ప్రభుత్వం పంపిణి చేసే బతుకమ్మ చీరలు, విద్యా సంస్థలకు పుస్తకాలు, డిపోల నుంచి బ్రాండీ షాపులకు మద్యం, హాస్పిటళ్లకు మందులు ఇలా ప్రభుత్వ పరంగా జరిగే ప్రతీ సరుకు రవాణా ఇకపై ఆర్టీసీ ద్వారానే జరిగేట్లు చూస్తామని సీఎం చెప్పారు. మరోవైపు ప్రజలు సరుకులను రవాణా చేయడానికి ప్రైవేటు ట్రాన్సుపోర్టును ఉపయోగిస్తున్నారని, ఇకపై ఆర్టీసీలోనే తమ సరుకును రవాణా చేసేలా ప్రోత్సహించాలని సీఎం సూచించారు.
ఇతర రాష్ట్రాలకు కూడ కార్గో సేవలు
ఆర్టీసీ కార్గోసేవలను తెలంగాణలోని ప్రతి మారుమూల ప్రాంతాలకు కూడ అందించడంతో పాటు, తెలంగాణ ప్రజలు ఎక్కువగా నివసించే...ముంబాయి, బీవండి, సోలాపూర్, నాగపూర్, జగ్దల్ పూర్ తదితర ప్రాంతాలకూ కూడా సరుకు రవాణా చేయాలని చెప్పారు. ఇక సరుకు ఎగుమతి, దిగుమతి కోసం హైదరాబాద్ తో పాటు ఇతర నగరాల్లో ఎక్కువ చోట్ల స్టాక్ పాయింట్లు పెట్టాలని సూచించారు... సరుకు రవాణా ఎంత ఎక్కువ చేయగలిగితే ప్రజలకు అంత సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ఆర్టీసీకి లాభాలు వస్తాయని సీఎం చెప్పారు..
ఉద్యోగుల సంక్షేమానికి బోర్డు
ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి యూనియన్లు వద్దని చెప్పిన సీఎం వారి సమస్యల పరిష్కారానికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమీక్షలో బోర్డు కూర్పును కూడ వివరించారు. ఇందులో భాగంగానే మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న బోర్డులో మొత్తం 202 మంది ఉద్యోగులు ఉండాలని సూచించారు. ప్రతి డిపోతో పాటు ఆర్టీసీ కార్యాలయం నుండి ఇద్దరి చొప్పున ఉద్యోగులు ఇందులో సభ్యులుగా ఉండనున్నారు. వీరిలో రిజర్వేషన్ విధానం కూడ తీసుకువచ్చారు. మొత్తం సభ్యుల్లో 94 మంది బీసిలు, 38 మంది ఎస్సీలు, 26 మంది ఎస్టీలు, 44 మంది ఓసీలు ఉంటారు. కాగా మొత్తం సభ్యుల్లో మహిళా ఉద్యోగులు 73 మంది ఉండాలని చెప్పారు.