కెనడాలో తెలంగాణ విద్యార్థి మృతి... ఫోన్ మాట్లాడుతూ 27వ అంతస్తు పైనుంచి పడి..
చదువు నిమిత్తం కెనడా వెళ్లిన ఓ తెలంగాణ విద్యార్థి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. సెల్ఫోన్లో మాట్లాడుతూ భవనం పైనుంచి కాలు జారి పడటంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని మరణవార్త తెలిసి హైదరాబాద్లోని అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్లోని వనస్థలిపురానికి చెందిన శ్రీకాంత్,హరిప్రియ దంపతుల రెండో కుమారుడు అఖిల్(19). గతేడాది కెనడాలోని ఓ యూనివర్సిటీలో అతను హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరాడు. ఈ ఏడాది కరోనా లాక్ డౌన్కి ముందే భారత్ వచ్చాడు. అక్టోబర్ 5న తిరిగి కెనడా వెళ్లిపోయాడు. అక్కడ ఓ భారీ బహుళ అంతస్తుల భవనంలో అఖిల్ నివాసముంటున్నాడు.
ఇదే క్రమంలో ఓరోజు 27వ అంతస్తులో ఫోన్ మాట్లాడుతూ... ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అఖిల్ మరణవార్త తెలిసి అతని కుటుంబం తీవ్రంగా విలపిస్తోంది. అఖిల్ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు సహకరించాలని అతని కుటుంబం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతోంది.
ఇటీవల అమెరికాలోని జార్జియాలో హైదరాబాద్ వాసి ఒకరు హత్యకు గురైన సంగతి తెలిసిందే. మృతుడిని హైదరాబాద్లోని చంచల్గూడకి చెందిన 37 ఏళ్ళ మహమ్మద్ ఆరిఫ్ మొహియుద్దీన్గా గుర్తించారు. గత 10 ఏళ్లుగా అతను అమెరికాలోనే ఉంటున్నాడు. జార్జియాలో కిరాణ స్టోర్స్ నడుపుతున్న అతనికి భార్య, పది నెలల పాప ఉన్నారు. వ్యాపార భాగస్వామితో విభేదాలే హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజే ఈ ఉదంతం వెలుగుచూడటం కలకలం రేపింది.