చంద్రబాబు ఫొటోకు తెలంగాణ విద్యార్థుల పాలాభిషేకం: ఎందుకంటే?
హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు వినూత్న నిరసనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రెండోసారి డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించిన విషయం తెలిసిందే.
అయితే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం డీఎస్సీ నోటిఫికేషన్ ఇంతవరకూ వెలువడలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని నిరుద్యోగులు అసహనానికి గురవుతున్నారు.
ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన మహబూబ్ నగర్లో గురువారం చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ.. డీఎస్సీకి సంబంధించి ఏపీలో రెండో నోటిఫికేషన్ కూడా వెలువడిందని, తెలంగాణలో అసలు నోటిఫికేషన్ వెలువడలేదంటూ మండిపడ్డారు. కాగా, ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ బుధవారం వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 12370 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.