'కేసుల' ఆయుధంతో కేసీఆర్ను నిలదీస్తున్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఓయు, ఇతర విద్యార్థుల పైన ఇప్పటికైనా అన్ని క్రిమినల్ కేసులు తొలగించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదివారం నాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును డిమాండ్ చేశారు.
కేసీఆర్కు రేవంత్ రెడ్డి ఓ బహిరంగ లేఖ రాశారు. 2009 నుంచి 2014 మధ్య విద్యార్థుల పైన 3,152 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందులో గత కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి తెరాస ప్రభుత్వం కలిపి 2వేల కేసులు ఎత్తివేశారని చెప్పారు.
మరో వెయ్యి కేసులకు పైగా ఉన్నాయని చెప్పారు. ఇందులో 698 కేసులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయని, మిగతావి కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని కేసులు ఎత్తివేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా కేసులు ఎత్తి వేసే దిశగా కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలన్నారు. కేసుల నేపథ్యంలో విద్యార్థులు ఉద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్నారని, కాబట్టి త్వరగా ఎత్తివేయాలన్నారు.
తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన కుటుంబాలకు ప్రభుత్వం చేసిన సాయం వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండు చేశారు.
అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగ నియామక పత్రాలను తీసుకెళితే ఖాళీల్లేవని చేర్చుకోవడం లేదన్నారు. ఆదిలాబాద్లో 27 మందికి నియామకపత్రాలిచ్చారని, వాటిని తీసుకుని ఉద్యోగాల్లో చేరడానికి ఆయా శాఖల కార్యాలయాలకు వెళితే ఉద్యోగాలేమీ ఖాళీ లేవని వెనక్కి తిప్పి పంపారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ఉద్యమకారులపై కేసులన్నింటినీ ఎత్తివేయిస్తామని గతంలో చెప్పారని, కానీ ఈ కేసులు ఇప్పటికీ ఉద్యమకారులను ఇబ్బంది పెడుతున్నాయన్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుగుతుంటే అదేరోజున నల్గొండ జిల్లా జేఏసీ కన్వీనర్ రాయపూడి చిన్నితో పాటు మరికొందరు కోదాడ కోర్టు గుమ్మం వద్ద పడిగాపులు పడాల్సి రావడం దురదృష్టకరమన్నారు.
వరంగల్ జిల్లా చేర్యాల టిఆర్ఎస్ మైనార్టీ విభాగం కన్వీనర్ జహీరుద్దీన్తో పాటు మరికొందరు పోలీసు ఉద్యోగాలకు ఎంపికైనా వారికి ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.
రాష్ట్ర పరిధిలోని 698 కేసులు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించినా ఉత్తర్వులు రాలేదన్నారు. ఉద్యమ కేసుల కారణంగా ఉద్యోగావకాశాలు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు గతంలో వారిపై కొనసాగిన కేసులు వారి భవిష్యత్తుకు విఘాతం కలిగించకుండా ఉత్తర్వు ఇవ్వాలన్నారు.