సాగర్ ఉపఎన్నిక,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీటీడీపీ...
నాగార్జునసాగర్ ఉపఎన్నికకు టీ-టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. మొవ్వ అరుణ్ కుమార్ను ఇక్కడినుంచి బరిలో దింపుతున్నట్లు ప్రకటించింది. అలాగే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్.రమణను ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్.రమణ మంగళవారం(ఫిబ్రవరి 22) నామినేషన్ వేస్తారని తెలిపింది. టీటీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ ఈ ప్రకటన చేశారు. సోమవారం జరిగిన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీఆర్ఎస్ తరుపున దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణిదేవి,కాంగ్రెస్ తరుపున చిన్నారెడ్డి,బీజేపీ తరుపున రామచంద్రరావు,స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈసారి పోటీలో టీఆర్ఎస్ తమ అభ్యర్థిని నిలబెట్టకపోవచ్చునని చాలామంది ఫిక్స్ అయిపోయారు. కానీ చివరి నిమిషంలో టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. సోమవారం సురభి వాణి నామినేషన్ దాఖలు వేసేందుకు వెళ్లినప్పటికీ.. సరైన ఫార్మాట్లో లేని కారణంగా అధికారులు ఆమె పత్రాలను తిరస్కరించారు.దీంతో మంగళవారం ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఈ నెల 26వ తేదీన నామినేషన్ల ఉపసంహారణకు చివరి తేదీ. మార్చి 14వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు.మార్చి 17వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇక నాగార్జునసాగర్ ఉపఎన్నికకు ఇప్పటివరకూ ప్రధాన పార్టీలేవీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. టీడీపీ మాత్రం మిగతా పార్టీల కంటే ముందుగానే తమ అభ్యర్థిని ప్రకటించడం విశేషం. టీఆర్ఎస్ తరుపున ఇక్కడినుంచి ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డిని బరిలో దింపే అవకాశం ఉంది. బీజేపీ తరుపున అంజయ్య యాదవ్,నివేదితా రెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ తరుపున దిగ్గజ నేత జానారెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.