పవన్ కళ్యాణ్ను ఏమన్నారో గుర్తుకుంది, అమరావతిలో స్థలం ఇస్తే: మోత్కుపల్లికి రమణ
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ కౌంటర్ ఇచ్చారు. మోత్కుపల్లి ఆరోపణలను కొట్టి పారేశారు.
టీడీపీ వ్యక్తులను చూసి భయపడే పార్టీ కాదని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా టీడీపీ ముందుకు సాగుతుందన్నారు. అమరావతిలో తనకు స్థలం ఇస్తే అక్కడే ఉండి పార్టీ కోసం పని చేస్తానని గతంలో మోత్కుపల్లి చెప్పారని తెలిపారు.
కానీ, ఇటీవల మోత్కుపల్లి వ్యవహరిస్తోన్న శైలి మారిపోయిందన్నారు. ఆయన వ్యవహార శైలిని ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. మోత్కుపల్లి వ్యవహారశైలి కన్నతల్లికి ద్రోహం చేసినట్లే ఉందన్నారు.
వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై మోత్కుపల్లి మాట్లాడిన మాటలు ప్రజలెవరూ మరిచిపోలేదన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి పిలిస్తే మోత్కుపల్లి రాలేదని, అప్పటి నుంచి ఏ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించడం లేదన్నారు. ఆయనకు పార్టీ ఎన్నో అవకాశాలు ఇస్తే ఇలా మాట్లాడుతున్నారన్నారు. పెడితే పెళ్లికి.. లేదంటే చావుకు అన్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.