తెలంగాణ టీడిపి పీఠం: రేవంత్ రెడ్డికి చుక్కెదురు, మోత్కుపల్లి దళిత కార్డు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ పగ్గాలను దూకుడుగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి అప్పగించాలని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో పాటు ఆయన కుమారుడు నారా లోకేష్ ప్రయత్నిస్తున్నా పార్టీలో అందుకు వ్యతిరేకత ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత మోత్కుపల్లి దళిత కార్డును ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన పలువురు నేతలు కూడా రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో అధినేత చంద్రబాబు మాత్రం ఐవీఆర్ఎస్ పేరు చెప్పి తప్పించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పదవి ఆశించే నేత మాత్రం ఐవీఆర్ఎస్ ఫలితానికి అనుగుణంగా పావులు కదిపి సక్సెస్ అయినట్లు భారీగా ప్రచారం జరుగుతున్నది. అయితే ఫలితం వెంటనే ప్రకటిస్తే నేతలు అలకపాన్పు ఎక్కి చివరకు పార్టీలు కూడా మారే ప్రమాదం ఉందని చంద్రబాబు గ్రహించినట్లు సమాచారం.
దాంతో తెలంగాణ పార్టీ నాయకులు తమలో తాము చర్చించుకుని ఏకాభిప్రాయానికి రావాలని చంద్రబాబు సూచించినట్లు చెబుతున్నారు.దాంతో ఓ టిడిపి నేత ఆదివారం నేతలందర్ని పిలిచి ఎర్రబెల్లి దయాకర్రావు ఇంట్లో విందు భోజనం ఏర్పాటు చేసి నచ్చజెప్పేందుకు నానా తంటాలు పడినట్లు తెలుస్తున్నది.
ప్రస్తుత అధ్యక్షుడు ఎల్ రమణకే మరోమారు అవకాశమివ్వాలని అధినేత మొదట్లో భావించారు. పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవడం వల్ల ఆయనను మార్చేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. రేవంత్రెడ్డికి పట్టం కట్టాలని మిగతా నేతలను ఏకగ్రీవంగా ఒప్పించాలనే ఉద్దేశంతోనే సమావేశం పెట్టారు. అయితే, అది అంత సులభంగా కనిపించడం లేదు.
ఇప్పటివరకు పార్టీ పదవిని ఆశించినవారిలో రేవంత్రెడ్డి, ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రమే ఉండేవారు. వీరికి తోడుగా తాజాగా మోత్కుపల్లి నర్సింహులు జత కలిసినట్లు తెలిసింది. దళితకార్డును ముందు పెట్టి ఆయన పదవిని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రం వ్యవహారాలను గమనిస్తూనే మధ్యమధ్యలో రేవంత్ రెడ్డికి చురకలంటించినట్లు సమాచారం.