పాలేరు ఉపఎన్నికకు టీడీపీ దూరం: కాంగ్రెస్కు మద్దతు, కారణం అదేనా?
హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మృతితో ఇక్కడ ఉపఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే.
పాలేరు ఉపఎన్నికలో పోటీ చేయకూడదని నిర్ణయించామని తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి మేరకు అభ్యర్ధిని బరిలో దించకుండా ఉండి కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిలు ఆదివారం అధికారికంగా వెల్లడించారు.
నిజానికి తెలుగుదేశం నుంచి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీ పడతారని భావించినా, విజయావకాశాలు చాలా తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కాగా పాలేరు ఉపఎన్నిక బరిలో కాంగ్రెస్ పార్టీ తరుపున మాజీ ఎమ్మెల్యే దివంగత రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సుచరిత రెడ్డికి టికెట్ కేటాయించారు.
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన మద్దతుని కాంగ్రెస్ పార్టీకి ప్రకటించింది. సుచరితా రెడ్డి పేరును టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి శనివారం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు టీఆర్ఎస్ను ఎలాగైనా సరే ఓడించాలనే ఉద్దేశ్యంతో టీడీపీ తన అభ్యర్ధిని పోటీలో నిలపకుండా కాంగ్రెస్కు మద్దతు ఇస్తుందని వాదనలు కూడా వెలువడుతున్నాయి.
దీంతో పాలేరు తుది పోరులో టీఆర్ఎస్, కాంగ్రెస్లు అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఇదిలా ఉంటే పాలేరు ఉపఎన్నిక బరిలో టీఆర్ఎస్ పార్టీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తమ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.