మాట్లాడనివ్వండి: స్పీకర్కు టీ- టీడీపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు శుక్రవారం ఉదయం శాసనసభ సభాపతి తెలంగాణ ధుసూదనా చారిని కలిశారు. బడ్జెట్ సమావేశాల్లో తమకు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కోరారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఆర్ కృష్ణయ్య, మాధవరం కృష్ణారావులు సభాపతిని కలిశారు. కాగా, గురువారం పదిమంది టీడీపీ ఎమ్మెల్యేల పైన వారం పాటు సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే.
శాసన సభ ప్రాంగణంలో టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ... అధికార తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు గట్టి బుద్ధి చెబుతారన్నారు. తమ పైన సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అధికారం శాశ్వతమని తెరాస భావిస్తోందన్నారు. మమ్మల్ని గెలిపించిన ప్రజలకు తాము జవాబుదారిగా ఉంటామన్నారు. కావాలనే అధికార పార్టీ తమ గొంతు నొక్కిందన్నారు.
మరోవైపు, శాసన సభలో పాఠశాల విద్య పైన వాడిగా వేడిగా చర్చ సాగుతోంది. ప్రభుత్వ పాఠశాలలు తన నియోజకవర్గంలో అద్భుతంగా నడుస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి తన నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుంచి నిరంతర ప్రయత్నాలు చేశానని, సుమారు 17 నూతన భవనాలను నిర్మించినట్లు తెలిపారు.
పాఠశాలలో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని కోరారు. జిల్లాల వారీగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మెరుగుపర్చేందుకు స్థానికంగా ఉన్న అన్ని జిల్లాల శాసనసభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలన్నారు. ప్రతీ ఎమ్మెల్యే ఒకటి రెండు పాఠశాలలను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చేస్తే ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజలకు విశ్వాసం పెరుగుతుందన్నారు.
హేతుబద్దీకరణ పేరుతో స్కూళ్ల మూసివేత సరికాదని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. అన్ని పాఠశాలలో టీచర్ల కొరత అధికంగా ఉందన్నారు. డీఎస్సీ పరీక్షలు నిర్వహించి టీచర్ల కొరతను నివారించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్య, మధ్యాహ్న భోజన సదుపాయాలు కల్పించినప్పటికీ పేద విద్యార్థులు పాఠశాలలో చేరడం లేదన్నారు.
ఉపాధ్యాయులు పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల ఉత్తీర్ణతకు చేసే ప్రయత్నాలను మరింత పెంచింతే బాగుంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలంటేనే దయనీయమైన పరిస్థితి నెలకొందన్నారు. పాఠశాలల ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని చంతల రామచంద్రా రెడ్డి అన్నారు.