ముందే కలిసి ఫిర్యాదు: ఎర్రబెల్లి-రేవంత్లపై చంద్రబాబు సీరియస్, క్లాస్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టిడిపి నేతలు మంగళవారం భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర రావు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
రెండ్రోజుల క్రితం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం విజయవాడకు వచ్చిన రేవంత్ రెడ్డి పార్టీ అధినేత చంద్రబాబుతో ప్రత్యేకంగా ముందే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనను వర్కింగ్ ప్రెసిడెంట్గా గుర్తించడం లేదని ఫిర్యాదు చేశారు. నేతల తీరు సరిగా లేదని ఆయన ఫిర్యాదు చేశారు.
పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ టీఆర్ఎస్ పైన ఉమ్మడి పోరు సాగిద్దామన్న తన వాదనకు ఏ ఒక్కరు మద్దతు పలకడం లేదన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి చెప్పిన అన్ని విషయాలను చంద్రబాబు సావదానంగా విన్నారు.
సమస్య మరింత పెద్దది కాకుండా చూడాలని, ఈ మేరకు తాను మిగిలిన నేతలతో మాట్లాడతానని రేవంత్ రెడ్డికి చంద్రబాబు హామీ ఇచ్చారని తెలుస్తోంది. అనంతరం భేటీలో ఎర్రబెల్లి, ఇతరులు కూడా రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.
కాగా, చంద్రబాబుతో భేటీలో రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర రావు, రావుల చంద్రశేఖర రెడ్డి, నామా నాగేశ్వర రావు, మాగంటి గోపినాథ్, ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబుతో జరిగిన భేటీలో ఎర్రబెల్లి - రేవంత్ గొడవ, పార్టీని వీడుతారని వార్తలు వస్తున్న గుండు సుధారాణి అంశం, వరంగల్ ఉప ఎన్నిక తదితరాల పైన చర్చిస్తున్నారని తెలుస్తోంది. ఎర్రబెల్లి - రేవంత్ గొడవ పైన చంద్రబాబు దృష్టిపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 29న సుధారాణి టిఆర్ఎస్లో చేరనున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
హాట్హాట్గా... రేవంత్, ఎర్రబెల్లిలకు చంద్రబాబు క్లాస్
రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర రావుల వాగ్వాదం పైన ఇరువురి వాదనలు విన్న పార్టీ అధినేత చంద్రబాబు ఇరువురు నేతలకు క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని, నేతలు పోట్లాడుకోవద్దని ఒకింత ఘాటుగానే హెచ్చరించినట్లు తెలుస్తోంది.