అరెస్ట్ వారెంట్: నరకం చూశాం, చంద్రబాబు కన్నీరు: మోడీ, కేసీఆర్ కుట్రేనంటూ టీటీడీపీ ఫైర్
హైదరాబాద్: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన ఘటనలో మహారాష్ట్ర కోర్టు నోటీసులు జారీ చేయడం ఆ పార్టీ తెలంగాణ నేతలు స్పందించారు. బాబ్లీ ప్రాజెక్టు కారణంగా తెలంగాణ ఎడారిగా మారుతుందనే తాము చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆందోళన చేశామని చెప్పారు.
శుక్రవారం టీడీపీ నేతలు నామా నాగేశ్వరరావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు నేతృత్వంలో 80మంది నేతలం నిరసన చేపట్టామని నామా నాగేశ్వరరావు చెప్పారు.
నరకం అనుభవించాం
మొదట బాబ్లీ ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్తామన్న మహారాష్ట్ర పోలీసులు.. తెలంగాణ సరిహద్దులోనే చంద్రబాబుతోపాటు అందర్నీ అరెస్ట్ చేశారని నామా తెలిపారు. ఒకే గదిలో 80మందిని బంధించారని అన్నారు. అక్కడ మంచినీళ్లు లేవని, టాయిలెట్ సౌకర్యం కూడా లేదని అన్నారు. తామంతా నరకం అనుభవించామని నామా తెలిపారు.
కలకలం: బాబుకు మహారాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్, ఈ 15 మందికీ, కారణం ఇదే
చంద్రబాబు కన్నీరుపెట్టారు..
తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందనే బాబ్లీ ప్రాజెక్టుకు నిరసనగా ఆందోళన చేపట్టామని నామా పునరుద్ఘాటించారు. అరెస్ట్ సందర్భంగా తమతోపాటు ఉన్న మహిళా ప్రజాప్రతినిధులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. ఈ పరిస్థితిని చూసి చంద్రబాబు కన్నీరుపెట్టుకున్నారని నామా చెప్పారు.
బీజేపీ ప్రభుత్వమే
అప్పుడు కుట్ర పూరితంగా అరెస్ట్ చేసి.. ఇప్పుడు అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం ఏంటని నామా ప్రశ్నించారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే ఇదంతా చేస్తోందని ఆరోపించారు.
కేసీఆర్ హస్తం కూడా..
ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తర్వాతే చంద్రబాబు ఈ అరెస్ట్ వారెంట్ నోటీసులు రావడం ఏంటని మరో నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఇందులో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హస్తం కూడా ఉందని ఆరోపించారు.
మోడీ, కేసీఆర్ కలిసి..
చంద్రబాబు అరెస్టుకు నరేంద్ర మోడీ, కేసీఆర్ కుట్ర పన్నారని టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి ఆరోపించారు. ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబుకు అవకాశం వచ్చిన తరుణుంలో ఆయన ప్రతిష్ట దిగజార్చే కుట్రలు చేస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు.