తెలంగాణా తెలుగుదేశం పార్టీ దారెటు?
హైదరాబాద్: తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రాజకీయంగా ఉత్సుకతను రేపుతోంది. ప్రతీ సార్వత్రిక ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో జతకట్టి ముందుకు వెళ్లే తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో మాత్రం వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో కలిసి ముందుకు వెళ్తారో అంచనా వేయడం కష్టంగా మారింది.
అదికారం లో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీని ఎదుర్కొనేందుకు స్థానిక పార్టీలను కలుపుకోవడమే కాకుండా జాతీయ పార్టీ సహకారంతో ఎన్నికల్లో పోటీ చేసే ఆనవాయితీ తెలుగుదేశం పార్టీది. కానీ తెలంగాణాలో ఇప్పుడు అదికారంలో ఉన్న గులాబీ పార్టీని ఢీ కొట్టాలంటే ఏ పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలో తేల్చుకోలేని పరిస్థితులు తలెత్తాయి.
బీజెపితో కలిసి మిత్రధర్మాన్ని కొనసాగించలేని పరిస్థితి.
గత ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ విధానాలను వ్యతిరేకించి మిత్ర ధర్మానికి దూరంగా ఉంటున్నట్టు ఎప్పుడో ప్రకటించింది. రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పని చేసే అవకాశాలు కనిపించడం లేదు. ప్రత్యేక హోదా అంశం పట్ల తెలుగుదేశం పార్టీ బీజెపి ప్రభుత్వం పై చేస్తున్న విమర్శనాస్త్రాల ప్రభావం తెలంగాణా బీజెపి మీద కూడా బాగా పనిస్తోంది.
కాని ఏపి లో ప్రమాదం పొంచి ఉండే అవకాశం..
దీంతో ఏపి లోనే కాకుంగా తెలంగాణాలో కూడా టీడిపి, బీజెపి పార్టీలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. దీంతో ఈ రెండు పార్టీలు 2019 సాదారణ ఎన్నికల్లో కలిసి పని చేసే అవకాశాలు ఏ కోశానా కనిపించడం లేదు. ఇక తెలంగాణాలో మిగిలింది అదికార గులాబీ పార్టీ తో పాటు కాంగ్రేస్ పార్టీ. కాంగ్రేస్ పార్టీ మూల సిద్దాంతాలకు వ్యతిరేకంగా ఉద్బవించినట్టుగా తెలుగుదేశం పార్టీని అభివర్ణించే టీడిపి నేతలు కాంగ్రేస్ పార్టీతో జత కడతారా అనే అంశం కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఎప్పటి లాగే పొత్తు మాత్రం ఉంటుందన్న బాబు..
టీడిపి జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రతి సమావేశంలో కాంగ్రేస్ పార్టీ విధానాలను ఎండగట్టడంతో పాటు రాష్ట్రానికి కాంగ్రేస్ పార్టీ తీరని ద్రోహం చేసిందని చెప్పుకొస్తుంటారు. ఇలాంటి సందర్బంలో తెలంగాణలో కాంగ్రేస్ పార్టీతో కలిసి ముందుకు వెళ్తే ఏపి లో దాని ప్రభావం ఎలా ఉంటుందోననే గుబులు కూడా చంద్రబాబుకు లేకపోలేదు. ఇక పరస్పర అవగాహనా రాజకీయాలకు లోబడి తెలుగుదేశం పార్టీ అదికార టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొనే అంశం పై కూడా టీడిపిలో పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది.
ఓటుకు నోటు వేగవంతంతో సమస్య మొదటికి..
టీఆర్ ఎస్ ప్రభుత్వంలో ఉన్నది నూటికి నూరి పాళ్లు తెలుగుదేశం పార్టీ నాయకులే కాబట్టి భవిష్యత్ రాజకీయాలు కలిసి నెరపే అవకాశాలు మొన్నటి ఉంటే ఉండొచ్చుననే భావన ఉన్నా.. తాజా రాజకీయ పరిణామాలు వాటిని పటాపంచలు చేసాయి. ఓటుకు నోటు కేసుపై ఉన్నతాదికారులతో సమీక్ష నిర్వహించిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్., చంద్రబాబుతో వైరం ఆగిపోలేదనే సంకేతాలు ఇచ్చారు.
టీటీడిపి క్షేత్రస్థాలో బలోపేతం సాధ్యమా..
దీంతో తెలంగాణా తెలుగుదేశం నేతలకు ఆ పార్టీతో పొత్తు అంశం పై నీలి నీడలు అలుముకున్నాయి. మొత్తానికి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణా తెలుగుదేశం పార్టీ నేతలకు పొత్తుల అంశం పై స్పష్టత రాక అమోమయానికి గురౌతున్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న చంద్రబాబు చివరి నిమిషంలో ఎలాంటి చతురత చూపిస్తారోనని రాష్ట్ర నాయకత్వం ఉత్కంఠగా ఎందురు చూస్తోంది.