న్యూజెర్సీలో తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి: కారులో మంటలు చెలరేగడంతో సజీవ దహనం
న్యూజెర్సీ/హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన వ్యక్తి మృతి చెందారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగడంతో నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ దేవేందర్ రెడ్డి(45) సజీవ దహనమయ్యారు.
దేవేందర్ రెడ్డి స్వస్థలం దేవరకొండ మండలం కర్నాటిపల్లి. నల్లమాద నర్సిరెడ్డి, భారతమ్మ దంపతుల రెండో కుమారుడు. 1998లో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయన ఐటీఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు.
అంతేగాక, టీఆర్ఎస్ ఎన్నారై విభాగంలో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేవేందర్ మృతి పట్ల పలువురు ఎన్నారైలు సంతాపం తెలిపారు దేవేందర్ రెడ్డికి భార్య అనురాధ, ఏడేళ్ల కుమార్తె చెర్రి ఉన్నారు.
ఉదయం 6 గంటల ప్రాంతంలో తన ఇంటి వద్ద ఉన్న కారు స్టార్ట్ చేసే క్రమంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని, తీవ్రగాయాలపాలైన దేవేందర్ రెడ్డి మృతి చెందాడని ఆయన సోదరుడు రవీందర్ రెడ్డి తెలిపారు. పోలీసులు దర్యాప్తులో మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందన్నారు.