తెలంగాణ టిడిపిలో అయోమయం: కెసిఆర్కు మహా సీఎం ఫోన్, పిలుపు
హైదరాబాద్: తెలంగాణలో పదిమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కారు ఎక్కారు. దీంతో టిడిపి తెలంగాణలో ఆత్మరక్షణలో పడింది. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రతిపక్షంగా అధికార తెరాసను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై టిడిపి తర్జన భర్జన పడుతోంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి నుంచి తెలంగాణలో 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఎర్రబెల్లి దయాకర రావు వంటి సీనియర్లు సహా పదిమంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. పార్టీ మారిన తమను తెరాసలో విలీనం చేయాలని సభాపతి మధుసూదనా చారికి.. ఎర్రబెల్లి లేఖ రాశారు.
ఇప్పుడు టిడిపిలో మిగిలింది కేవలం అయిదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే. ఈ అయిదుగురిలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఇటు దూరం కాకుండా, అటు దగ్గర అన్నట్లు కాకుండా ఉంటున్నారు.
మిగిలిన వారిలో టిడిపి శాసన సభా పక్ష నేతగా రేవంత్ రెడ్డిని నియమించాలని, బిఎసి సమావేశంలో సండ్ర వెంకట వీరయ్యకు అవకాశం ఇవ్వాలని టిడిపి అధినేత చంద్రబాబు సభాపతికి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ రెండు లేఖల పైన స్పీకర్ కార్యాలయం నుంచి ఇంకా నిర్ణయం వెలువడలేదు.
ఇదే ఇప్పుడు టిడిపి నేతలలో ప్రధానంగా అయోమయంలో పడేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తెరాసలోకి జంప్ అవుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితి వస్తే టిడిపికి శాసన సభా కార్యాలయం కూడా లేకుండా పోతుంది.
ఎఱ్రబెల్లి విలీనం లేఖ పైన స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు టిడిఎల్పీ నేతగా రేవంత్ రెడ్డికి గుర్తింపు ఇచ్చే అంశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. కాగా, తెలంగాణ బడ్జెట్ సమావేశంలో ఈ నెలలలో ఉండనున్నాయి.
కెసిఆర్తో ఫోన్లో మాట్లాడిన ఫడ్నవీస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలంగాణ సీఎం కెసిఆర్కు బుధవారం ఉదయం ఫోన్ చేశారు. ప్రాజెక్టులపై చర్చ నిమిత్తం ఫోన్ చేశారు. ఈ నెల 7న కెసిఆర్, మంత్రి హరీష్ రావు ముంబై వెళ్లనున్నారు. 8న కాళేశ్వరం ప్రాజెక్టు పైన రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరనుంది.