తెలంగాణలో ఘోరం: తెలిసి తెలిసీ ఆర్టీసీ బస్సులో ముగ్గురు పేషెంట్ల జర్నీ: బస్సు మొత్తానికీ భయం
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు కొండలా పెరిగిపోతోంది. దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు ఫలించట్లేదు. సత్ఫలితాలను ఇవ్వట్లేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేసీఆర్ సర్కార్ తీసుకుంటోన్న చర్యలు కొందరి నిర్లక్ష్యం వల్ల ఆవిరి అవుతున్నాయి. వైరస్ సోకిందనే విషయం తెలిసినప్పటికీ ముగ్గురు పేషెంట్లు టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించడమే దీనికి నిదర్శనం.
ఈ ముగ్గురూ ఏకంగా హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. నిర్మల్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు కరోనా లక్షణాలతో హైదరాబాద్కు వచ్చారు. ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురికీ కరోనా వైరస్ సోకినట్లే తేలింది. ఆ రిపోర్టులు తీసుకుని ముగ్గురూ మళ్లీ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు బయలుదేరి వెళ్లారు. దీనికోసం వారు టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్లో మధ్యాహ్నం 3:30 గంటలకు ఆదిలాబాద్ డిపోనకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు టీఎస్ 08 జెడ్ 0229 ఎక్కారు. రాత్రి 10:30 గంటల సమయంలో ఆదిలాబాద్లో దిగారు. నేరుగా రిమ్స్లో చేరారు. హైదరాబాద్లో తాము చేయించుకున్న కరోనా వైరస్ పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను ఆసుపత్రి డాక్టర్లకు చూపించారు. అక్కడే అడ్మిట్ అయ్యారు. ఆ రిపోర్టులు హైదరాబాద్కు చెందినవి కావడంతో ఆదిలాబాద్ రిమ్స్ డాక్టర్లు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Recommended Video
తాము ఆర్టీసీ బస్సులో నిర్మల్ జిల్లా నుంచి హైదరాబాద్కు రాకపోకలు సాగించినట్లు వివరించారు. వెంటనే డాక్టర్లు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. టీఎస్ 08 జెడ్ 0229 శనివారం మధ్యాహ్నం జూబ్లీ బస్స్టేషన్ నుంచి ఆదిలాబాద్కు ప్రయాణించిన వారు వెంటనే కరోనా వైద్య పరీక్షలను చేయించుకోవాలని, హోమ్ క్వారంటైన్ లేదా హోమ్ ఐసొలేషన్కు వెళ్లాలని సూచించారు. ఆ సమయంలో ఈ బస్సులో మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ఆదిలాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్ తెలిపారు.