Black Fungus: తెలంగాణలో డేంజర్ బెల్స్: చూపు కోల్పోయిన ముగ్గురు..ఒకరి మృతి
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి కోలుకొన్న వారిని బ్లాక్ ఫంగస్ (Black Fungus) ఇన్ఫెక్షన్ వెంటాడుతోంది. భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ తరహా కేసులు దేశవ్యాప్తంగా భారీగా పెరిగిపోతోన్నాయి.. ప్రత్యేకించి తెలంగాణలో. బ్లాక్ ఫంగస్ కేసులు తొలిసారిగా వెలుగులోకి వచ్చిన మహారాష్ట్ర సరిహద్దులకు ఆనుకుని ఉన్న జిల్లాల్లో దీని తీవ్రత అధికంగా కనిపిస్తోంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతోన్న వారి సంఖ్య అటు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో, ఇటు సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో పెరిగిపోతోన్నాయి. సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో ఇప్పటికే 11 మంది బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి.
Recommended Video
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు..ఇక మాస్కుల్లేకుండా తిరగొచ్చు: జో బిడెన్
చూపు కోల్పోయిన 22 ఏళ్ల యువతి..
బ్లాక్ ఫంగస్ బారిన పడి 22 సంవత్సరాల యువతి కంటి చూపును శాశ్వతంగా కోల్పోయారు. ఆమె పేరు అస్ఫియా. నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతి. పేద కుటుంబానికి చెందిన ఆమె తొలుత కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనాపై పోరాడి విజయం సాధించినప్పటికీ- బ్లాక్ ఫంగస్ ఆమెను వెంటాడింది. బ్లాక్ ఫంగస్ బారిన పడిన తరువాత నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి, కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారు. ఫలితం రాలేదు. దీనితో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి, అనంతరం ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ను సందర్శించినప్పటికీ.. ఉపయోగం లేదు. ఈ లోగా ఇన్ఫెక్షన్ తీవ్రత పెరగడంతో ఎడమ కంటి చూపును ఆమె కోల్పోయారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
మరో ఇద్దరికీ..
అస్ఫియాతో పాటు మరో ఇద్దరు శాశ్వతంగా కంటి చూపును కోల్పోయినట్లు సరోజినీ దేవి కంటి ఆసుపత్రి అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో 11 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. కంటికి సోకే ఇన్ఫెక్షన్ కావడం వల్ల వారంతా సరోజినీ దేవి ఆసుపత్రిలో చేరారు. వారికి లైపొసొమాల్ యాంఫోటెరిసిన్ బీ ట్రీట్మెంట్ ఇస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీ రాజలింగం తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉంటుందని, దానివల్లే ఈ ఇన్ఫెక్షన్ సోకుతోందని చెప్పారు. కంటి చూపు మందగిస్తున్నట్లు సంకేతాలు అందిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. దీన్ని నివారించడానికి యాంఫోటెరిసిన్ బీ (Amphotericin B) ఇంజెక్షన్ను వినియోగిస్తున్నామని అన్నారు.
మరొకరి మృతి
బ్లాక్ ఫంగస్ బారిన పడి మరొకరు మరణించారు. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ఒకరు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీన్ని అధికారులు ధృవీకరించాల్సి ఉంది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో వినియోగించే యాంఫొటెరిసిన్ బీ ఇంజెక్షన్లకు హఠాత్తుగా డిమాండ్ పెరిగింది. ఈ ఇంజెక్షన్ ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు చాలినన్ని యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్లను సరఫరా చేయడానికి అవసరమైన నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఫార్మా సూటికల్స్ కంపెనీలకు ఆదేశాలను జారీ చేసింది.