తెలంగాణలో కరోనా పీచమణచడానికి వుహాన్ స్ట్రాటజీ:సుదీర్ఘ లాక్డౌన్ ఒక్కటే బ్రహ్మాస్త్రం:తొలి రాష్ట్రంగా
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా అది సంచలనమే అవుతుంటుంది. ప్రత్యేకించి- ప్రాణాంతక కరోనా వైరస్ విచ్చలవిడిగా చెలరేగిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ నిర్ణయాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కంటే ఓ అడుగు ముందే ఉన్నామనే సంకేతాన్ని ఇస్తోంది. తాజాగా లాక్డౌన్ పొడిగింపుపై కేసీఆర్ తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు కూడా అలాంటివే. సుదీర్ఘ లాక్డౌన్ ఒక్కటే కరోనా వైరస్కు విరుగుడు అనే విషయాన్ని గులాబీ బాస్ బలంగా నమ్ముతున్నారనేది స్పష్టమైంది.
దేశవ్యాప్తంగా 17న లాక్డౌన్ ముగుస్తుండగా..
లాక్డౌన్ గడువును పొడిగించే విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు భిన్నంగా కనిపించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన చర్యల కంటే ఓ అడుగు ముందే ఉన్నానని నిరూపించుకున్నారు. రెండోదశ లాక్డౌన్ ఈ నెల 3 తేదీన ముగియాల్సి ఉండగా..తెలంగాణలో 7వ తేదీ వరకు పొడిగించారు. మూడో విడత లాక్డౌన్ ఈ నెల 17వ తేదీ నాటికి ముగియబోతుండగా.. తెలంగాణాలో 29వ తేదీ వరకు ఉండేలా ముందు జాగ్రత్త పడ్డారు. కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత అనేది తగ్గకపోతే.. 29వ తేదీ కూడా లాక్డౌన్ ఎత్తేస్తారనేది అనుమానమేనని అంటున్నారు.
కరోనాపై లాక్డౌన్ ఒక్కటే బ్రహ్మాస్త్రంగా..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేసీఆర్ లాక్డౌన్ బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నారనేది స్పష్టమైంది. కరోనా వైరస్ ప్రధాన లక్షణం.. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడం. దగ్గడం, తుమ్మడం, చేతులను కలుపుకోవడం వంటి చర్యల వల్ల కరోనా సోకిన రోగి నుంచి ఆ వైరస్ మరొకరికి వ్యాప్తి చెందుతోంది. మనిషి మనిషి మధ్య సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా చేయడం కష్టతరం కావడం వల్ల ఎవరూ గానీ గడప దాటకూడదనే నిబంధనను భారత్ సహా అనేక దేశాలు పాటిస్తున్నాయి. లాక్డౌన్ను అమల్లోకి తీసుకొచ్చాయి. అమలు చేయడంలో కొన్ని లోపాలు తలెత్తుతున్నప్పటికీ.. మొత్తంగా సత్ఫలితాలను ఇస్తోంది.
వైరస్ పుట్టినింట్లో సైతం..
కరోనా వైరస్కు జన్మనిచ్చిన చైనాలోని వుహాన్ సిటీ సైతం లాక్డౌన్ సూత్రంతోనే గట్టెక్కింది. వుహాన్లో అత్యంత సుదీర్ఘంగా అంటే 76 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగింది. వుహాన్లో కొత్త కేసులు పెరగకుండా ఈ లాక్డౌన్ ఉపయోగపడింది. ప్రస్తుతం అక్కడ కరోనా వైరస్ కేసులు నామమాత్రంగా కూడా నమోదు కావట్లేదు. వుహాన్ ఒక్కటే కాదు.. చైనా వ్యాప్తంగా అదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వుహాన్ సిటీ ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చుతున్నారు. రవాణా ఒక్కటే కాదు.. జనజీవనం కూడా పట్టాలెక్కింది. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.
అదే స్ట్రాటజీతో..
వైరస్కు జన్మనిచ్చిన వుహాన్లోనే కరోనా పీచమణచగా లేనది ఆ పని మనం మాత్రం చేయలేమా అనేది కేసీఆర్ ఆలోచన. అందుకే అదే స్ట్రాటజీని ఆయనా తెలంగాణలో అమలులోకి తీసుకొచ్చారు. వుహాన్లో 76 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగింది. దేశంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చిన మార్చి 24వ తేదీ నుంచి లెక్కేసుకుంటే మే 29వ తేదీ నాటికి 66 రోజులకు చేరుతుంది. గడువు ముగిసిన తరువాత పరిస్థితులను బట్టి తెలంగాణలో లాక్డౌన్ను పొడిగించడంపై నిర్ణయాన్ని తీసుకుంటామని కేసీఆర్ చెప్పడాన్ని బట్టి చూస్తే.. మరి కొన్ని రోజుల పాటు గడప దాటే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
Recommended Video
ప్రపంచ వ్యాప్తంగా సుదీర్ఘ లాక్డౌన్ ప్రకటించిన దేశాల జాబితాలో..
వుహాన్లో జనవరి 23వ తేదీన అమలులోకి తీసుకొచ్చిన లాక్డౌన్ కిందటి నెల 8వ తేదీ వరకు కొనసాగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు కుదుటపడ్డాయి. కొన్ని జాగ్రత్తలతో సాధారణ జనజీవనం ఆరంభమైంది. ప్రజా రవాణా సైతం పట్టాలెక్కింది. సింగపూర్లో జూన్ 1వ తేదీ వరకూ లాక్డౌన్ కొనసాగనుంది. కిందటి నెల 7వ తేదీన అక్కడ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. బ్రిటన్లో అదే పరిస్థితి నెలకొంది. మార్చి 23వ తేదీన అమల్లోకి తీసుకొచ్చిన లాక్డౌన్ను జూన్ వరకూ పొడిగించే అవకాశాలు లేకపోలేదు. స్వయంగా బ్రిటన్ ప్రధానమంత్రే కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు. తాజాగా-తెలంగాణ ప్రభుత్వం ఆయా దేశాల జాబితాలో చేరినట్టయింది.