13వ స్థానం నుంచి ఏడాదిలో ఫస్ట్, అంతా మనవల్లే: కేసీఆర్
హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ సేవల్ని సులభతరం, సరళతరం చేసిన ఫలితాలు అందరికీ అందుతున్నాయని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేవారికి, వర్తక, వ్యాపార, వాణిజ్యాలు నిర్వహించాలనుకునే వారికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. 340 విభాగాల్లో విధానాల్ని అధ్యయనం చేసిన తర్వాత ర్యాంకింగ్ నిర్వహించారన్నారు. ఈ విభాగాలు పర్యవేక్షిస్తున్న అధికారులను కేసీఆర్ అభినందించారు.
ప్రభుత్వ విధానాల రూపకల్పనలో పారదర్శకత, సింగిల్ విండో విధానం, భూమి లభ్యత, నిర్మాణ అనుమతులు, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రధాన విభాగాల్లో రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలకు గరిష్ట మార్కులు రావడం పట్ల కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ విధానాలు గొప్పగా ఉండ బట్టే అతి తక్కువ సమయంలో తెలంగాణకు 2,550 పరిశ్రమలు వచ్చాయన్నారు. గతేడాది 13వ స్థానంలో ఉన్న తెలంగాణను ఈ ఏడాది తొలిస్థానంలో నిలిచేందుకు ప్రభుత్వ విధానాలతో పాటు అధికారుల కృషి కూడా కారణమన్నారు. అధికారులు ఇదే స్ఫూర్తి, ఒరవడిని కొనసాగించాలన్నారు.