టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట కన్నుమూత: నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జర్నలిస్ట్
దుబ్బాక: తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 56 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చీబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొద్దిరోజుల కిందట అనారోగ్యానికి గురైన ఆయన గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.
కరోనా బారినపడ్డ మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఆ ఎమ్మెల్సీ ఇంట్లో 8 మందికి పాజిటివ్...
జర్నలిస్టుగా..
వృత్తిపరంగా సోలిపేట రామలింగారెడ్డి జర్నలిస్టు. ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో సుమారు 20 సంవత్సరాల పాటు పనిచేశారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2004లో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆయనకు పిలిచి మరీ టికెట్ ఇచ్చారు. 2004లో దొమ్మాట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పటి నుంచి ఇక వెనుతిరిగి చూసుకోలేదు. నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేశారు. 2008లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా..
నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఆయన దుబ్బాక నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. 2009లో కాంగ్రెస్ సీనియర్ నేత చెరుకుపల్లి ముత్యంరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. 2018లో నిర్వహించిన ఎన్నికల్లో 62 వేలకు పైగా ఓట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించారు. జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం ఉండటంతో సామాజికాంశాల పట్ల ఆయనకు మంచి పట్టు ఉండేది. నిత్యం ప్రజల్లో తిరిగేవారు తన నియోజకవర్గంలోని అన్ని గ్రామాలనూ తిరిగిన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు.
కిడ్నీ సంబంధిత ఇబ్బందులతో..
కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు చెబుతున్నారు. కొద్దిరోజుల కిందట అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన రామలింగారెడ్డికి ఆర్థికమంత్రి హరీష్ రావు స్వయంగా పరామర్శించారు. మెరుగైన వైద్యాన్ని అందించాలని డాక్టర్లకు సూచించారు.
సోలిపేట ఆరోగ్య పరిస్థితిపై కేసీఆర్ కూడా ఆరా తీశారు. చికిత్స పొందుతోన్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం అంత్యక్రియలను నిర్వహిస్తారని సమాచారం.
Recommended Video
కేసీఆర్ దిగ్భ్రాంతి..
సోలిపేట మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. సోలిపేట మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీష్రావు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఇతర పార్టీ సీనియర్ నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం తీరనిలోటుగా పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకుడు లేరని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో సోలిపేట రామలింగారెడ్డి చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. అంకితభావంతో పనిచేసే నాయకుడిని పార్టీ కోల్పోయిందని అన్నారు.