టీఆర్ఎస్లో విషాదం: ఎమ్మెల్యే కన్నుమూత: చికిత్స పొందుతూ తుదిశ్వాస: జెయింట్ కిల్లర్గా
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సమితి విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూశారు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
హిమాయత్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటున్న ఆయన సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీనితో ఆయనను హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు.
నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. 2018 నాటి ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత, హోం శాఖ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిని ఓడించారు. జెయింట్ కిల్లర్గా గుర్తింపు పొందారు. 2014లో ఆయన ఇదే స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. జానారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తరువాతి ఎన్నికల్లో జానారెడ్డి మీదే విజయం సాధించారు. ఇదివరకు నోముల నర్సింహయ్య సీపీఎంలో పనిచేశారు.
రెండుసార్లు సీపీఎం తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సీపీఎం శాసనసభా పక్ష నేతగా వ్యవహరించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఉన్నారు. తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ క్రియాశీలక నేతగా గుర్తింపు పొందారు. వామపక్ష పోరాట ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ కేడర్కు దిశా నిర్దేశం ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో ఆయన సీపీఎంకు గుడ్బై చెప్పారు. 2014లో గులాబీ కండువాను కప్పుకొన్నారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఘన విజయాన్ని అందుకున్నారు.