రామగుండం వద్ద రోడ్డు ప్రమాదం: గుంటూరు జిల్లావాసుల దుర్మరణం: కారు నుంచి భారీగా బంగారం
పెద్దపల్లి: తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తెల్లవారు జామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అతివేగం, నిద్రమత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన వారిగా గుర్తించారు. కారు, సంఘటనా స్థలం నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి వారిద్దరు బంగారు వ్యాపారులై ఉండొచ్చని భావిస్తున్నారు.
మృతులను కొత్త శ్రీనివాస్, రాంబాబుగా గుర్తించారు. హైదరాబాద్లో బంగారాన్ని కొనుగోలు చేసి నరసరావుపేటకు బయలుదేరి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన కారులో డ్రైవర్ సహా నలుగురు ఉన్నారు. మార్గమధ్యలో వారు ప్రయాణిస్తోన్న నంబర్ ఏపీ 07 సీడబ్ల్యూ 4005 కారు పెద్దపల్లి జిల్లా రామగుండం వద్ద ప్రమాదానికి గురైంది. మల్యాలపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద బోల్తాపడింది. ఈ ఘటనలో రాంబాబు సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగం, నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. వేగంగా ప్రయాణిస్తోన్న కారును మల్యాలపల్లి రైల్వేబ్రిడ్జి వద్ద మలుపులో డ్రైవర్ అదుపు చేయలేకపోయి ఉండొచ్చని, ఫలితంగా అది బోల్తా కొట్టిందని అంచనా వేస్తోన్నారు. ప్రమాదానికి గురైన కారు మొత్తం నుజునుజ్జయింది. ముందు భాగం మొత్తం ధ్వంసమైంది. గాయపడ్డ వారిని వెలికి తీయడానికి శ్రమించాల్సి వచ్చింది. కారు బోల్తా పడటంతో బంగారం మొత్తం చెల్లాచెదురుగా పడింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం కేజీన్నర బంగారాన్ని పోలీసులు సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. కారులో కొన్ని రశీదులు, బిల్లుల ఆధారంగా మృతులు బంగారు వ్యాపారులై ఉండొచ్చని భావిస్తున్నారు. గాయపడ్డ వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. నరసరావుపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.