మీడియా జోలికి రావద్దు, ఆ విషయం గుర్తుంచుకుంటే మంచిది: పవన్కి వ్యతిరేకంగా జర్నలిస్టుల నిరసన
హైదరాబాద్: మీడియా సంస్థల పట్ల పవన్ కల్యాణ్, ఆయన అభిమానులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నట్టు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయుడబ్ల్యూజె) కమిటీ ప్రెసిడెంట్ అల్లం నారాయణ ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.
'అన్యాయానికి గురవుతున్నవారి విషయాలను ఎప్పటికప్పుడు బయటపెట్టడంలో మీడియా ముందుంటుంది.తమకు అన్యాయం జరిగిందని ఎవరు బయటకొచ్చినా.. వారి వేదనను సమాజానికి, ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత మీడియాకు ఉంది. ఇది శ్రీరెడ్డితోనే మొదలుకాలేదు. అనేక సంఘటనల్లో మీడియా చొరవతో బాధితులకు న్యాయం జరిగిందన్న విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తించాలి.' ఆ నోట్ లో పేర్కొన్నారు.
సినిమా పరిశ్రమలో జరుగుతున్న విషయాలపై మీడియా స్వయంగా కథనాలు ప్రసారం చేయలేదని నోట్ లో పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో పరిణామాలకు మీడియా కారణం కాదని, శ్రీరెడ్డి ఉదంతం తర్వాత జరిగిన పరిణామాలను మాత్రమే మీడియా ప్రసారం చేసిందని అన్నారు.
పవన్ కల్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సినిమా హీరోలాగా ఉద్వేగానికి లోనై ట్వీట్లలో మీడియా సంస్థల అధిపతుల ఫోటోలు పెట్టి అభిమానులను రెచ్చగొట్టినందువల్లే ఫిలిం ఛాంబర్ వద్ద మీడియాపై దాడి జరిగిందని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా.. ప్రజాస్వామిక, భావ ప్రకటనా స్వేచ్చలను అర్థం చేసుకుంటే మీడియా పట్ల సమన్వయం పాటించేవారని అన్నారు.
మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం సబబు కాదని, మీడియా స్వేచ్చను కాపాడుకోవడానికి జర్నలిస్టు సంఘాలు సదా సిద్దంగా ఉంటాయని పవన్ కల్యాణ్, ఆయన అభిమానులు గుర్తుంచుకుంటే మంచిదని నోట్ ద్వారా తెలిపారు. మీడియా మీద దాడులను తీవ్రంగా ఖండిస్తూ.. మరోసారి జరిగితే ఆందోళన తప్పదని, మీడియా జోలికి రావద్దని పవన్ కల్యాణ్ కు గుర్తుచేస్తున్నామన్నారు.
పవన్ కల్యాణ్ వైఖరికి నిరసనగా ఏప్రిల్ 21 నాటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల నిరసన కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు.