బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్: ఉత్తర తెలంగాణలో ఇంటర్నెట్ కట్: భైంసాలో అనుక్షణం!
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు రాజాసింగ్ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. నిర్మల్ జిల్లాలోని భైంసా వెళ్లడానికి ఆయన చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఛలో భైంసా ఆందోళనను భగ్నం చేశారు. సోమవారం రాత్రి భైంసాలో చోటు చేసుకున్న అల్లర్లు, రెండు వర్గాల మధ్య సంభవించిన దాడులు, ప్రతిదాడులకు నిరసనగా ఆయన ఛలో భైంసాకు పిలుపునిచ్చారు.
భైంసాలో 144 సెక్షన్..
ఈ ఆందోళన వల్ల ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమౌతాయనే అనుమానంతో పోలీసులు ముందు జాగ్రత్తలు చేపట్టారు. రాజాసింగ్ను గృహ నిర్బంధంలో ఉంచారు. భైంసాలో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఓ చిన్న గొడవ.. తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఒక వర్గం వారి నివాసాలపై మరొక వర్గం వారు దాడులు చేశారు. ప్రతిదాడులకు దిగారు. ఈ ఘటన అనంతరం పోలీసులు భైంసాలో 144 సెక్షన్ను విధించారు. ఫలితంగా పరిస్థితిని అదుపులోకి వచ్చింది.
రెండు బెటాలియన్ల పోలీసుల తరలింపు..
భైంసాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి దృష్టిలో ఉంచుకుని అక్కడ సుమారు రెండు బెటాలియన్ల మేర రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరింపజేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉత్తర తెలంగాణలో నాలుగు జిల్లాల్లో ఇంటర్నెట్ను నిషేధించారు. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో వదంతులు వ్యాపించకుండా ఇంటర్నెట్ ఆపేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై పోలీసులు నిఘా ఉంచారు.
పోలీసులపైనా రాళ్ల దాడులు..
భైంసాలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఓ చిన్న వివాదం ఫలితంగా- ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు వర్గాల మధ్య అల్లర్లకు కారణమయ్యాయి. ఒక వర్గం వారు మరో వర్గం ఇళ్లపైకి దాడులు చేశారు. ఇళ్ల ముందు నిలిపి ఉంచిన వాహనాలను తగులబెట్టారు. పోలీసులపైనా రాళ్లు రువ్వారు. ఈ రాళ్ల దాడిలో పోలీసులు సైతం గాయపడ్డారు. దీనిపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించింది. పెద్ద ఎత్తున పోలీసుల బలగాలను మోహరింపజేసింది.
బీజేపీ ఎంపీ, ఎమ్మెల్సీ అదుపులో..
భైంసాలో పర్యటించడానికి ప్రయత్నించిన ఆదిలాబాద్ లోక్సభ సభ్యుడు సోయం బాపురావు, ఎమ్మెల్సీ రామచంద్రరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా- ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించ తలపెట్టిన ఛలో భైంసా ప్రదర్శనను అడ్డుకున్నారు. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. దీనిపై రాజాసింగ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఒక వర్గం నాయకులకు వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. ఎంఐఎం గూండాలు ఈ దాడులకు పాల్పడ్డారని, హిందూ వాహిణి కార్యకర్తల నివాసాలపై మూకదాడులు చేశారని విమర్శించారు.
ప్రత్యారోపణలు చేస్తోన్న మజ్లిస్..
మరోవంక- అఖిల భారతీయ మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నాయకులు ప్రత్యారోపణలు దిగుతున్నారు. భైంసా అల్లర్ల వెనుక సంఘ్ పరివార్ హస్తముందని ఆరోపిస్తున్నారు. మైనారిటీలపై ఉద్దేశపూరకంగా దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మైనారిటీల ఇళ్లపై దాడులకు పాల్పడిన అల్లరి మూకలను ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితిని సమీక్షించడానికి వెళ్లదలచుకున్న తమను పోలీసులు అడ్డుకుంటున్నారని, భైంసా వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.