తెలంగాణకు నేడు భారీ వర్ష సూచన... చల్లబడ్డ హైదరాబాద్... పలుచోట్ల ఒక మోస్తరు వర్షం...
హైదరాబాద్లో సోమవారం(ఏప్రిల్ 13) రాత్రి నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్,రాంనగర్,విద్యానగర్,తార్నాక,మియాపూర్,చందానగర్,గచ్చిబౌలి,మాదాపూర్,కుత్బుల్లాపూర్,బోరబండ,రహమత్ నగర్,ఎల్బీనగర్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఎల్బీనగర్,వనస్థలిపురం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
పలు ప్రాంతాల్లో భారీగా ఈదురు గాలులు వీయడంతో విద్యుత్కు అంతరాయం కలిగింది. కొన్ని ప్రాంతాల్లో లో ఓల్టేజీ సమస్య తలెత్తింది. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది సమస్యలను పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. రాత్రి కురిసిన వర్షంతో నగరం ఒక్కసారిగా చల్లబడింది. భానుడి భగభగలతో విపరీతమైన ఉక్కపోతతో సతమతమైన నగర జీవులకు ఇది కాస్త ఉపశమనం కలిగించింది.
గత రెండు,మూడు రోజుల నుంచి తెలంగాణలో హైదరాబాద్ సహా పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం నమోదవుతోంది. పంటలు చేతికందే సమయంలో కురుస్తున్న వర్షాలతో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. చెడగొట్టు వానలు పంటను చేతికందనిస్తాయో లేదోనని ఆవేదన చెందుతున్నారు. తెలంగాణకు మరో మూడు రోజులు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పలు జిల్లాల్లో గంటకు 30కి.మీ. నుంచి 40కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. బుధవారం(ఏప్రిల్ 14) రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగామ, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
మధ్యప్రదేశ్, తీర ప్రాంతంలోని కొమొరిన్ ఏరియాలో ఏర్పడిన తుఫాన్ తరహా వాతావరణం వల్ల వచ్చే మూడు, నాలుగు రోజుల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని రెండు రోజుల క్రితం భారత వాతవరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.