జగన్కు కేసీఆర్ గట్టి వార్నింగ్... ఇష్టారాజ్యమంటే కుదరదు... కౌంటర్ ప్రాజెక్ట్ ఖాయం...
మంగళవారం(అక్టోబర్ 6) జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. రాయలసీమ లిఫ్టు,పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును ఏపీ వెంటనే నిలిపివేయకపోతే తెలంగాణ కూడా దూకుడుగా వ్యవహరించక తప్పదన్నారు. ఏపీకి కౌంటర్గా ఆలంపూర్-పెద్ద మరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి రోజుకు 3టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామని హెచ్చరించారు. తెలంగాణ నీటి వాటాను కొల్లగొట్టేలా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే చూస్తూ ఊరుకోమని... తమ రైతాంగ ప్రయోజనాల కోసం తామూ సిద్దమేనని చెప్పారు.
అపెక్స్ కౌన్సిల్ భేటీలోఅదే తేలింది .. కేసీఆర్ వల్లే జగన్ కు బలం పెరిగింది .. బండి సంజయ్ ఫైర్
కౌంటర్గా బాబ్లీ తరహా ప్రాజెక్ట్...
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేయాలని ఈ ఏడాది అగస్టు 20న ఏపీకి కేంద్రం రాసిన లేఖను సీఎం కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్లో గుర్తుచేశారు. కేంద్రం స్పష్టమైన ఆదేశాలిచ్చినా... ఏపీ మాత్రం దూకుడుగానే వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ముందుకు పోతున్న ఏపీకి ముకుతాడు వేయాలని కోరారు. కేంద్రం ఆదేశాలను,తమ వాదనలను వినిపించుకోకుండా ఇష్టారాజ్యంగా ముందుకు సాగితే... గోదావరిపై మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మించిన తరహాలో కృష్ణా నదిపై ఆలంపూర్-పెద్ద మరూర్ దగ్గర తెలంగాణ బ్యారేజీ నిర్మించి తీరుతుందన్నారు. దీని ద్వారా రోజుకు 3టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేస్తామన్నారు.
కొత్త ప్రాజెక్టులేవీ లేవు...
తెలంగాణలో కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో కొత్తగా చేపట్టినవేవీ లేవని కేసీఆర్ కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు స్పష్టం చేశారు. ఇప్పుడున్న అన్ని ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలయ్యాయని చెప్పారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన 967.94టీఎంసీలకు లోబడే గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ప్రాజెక్టుల డీపీఆర్లు సమర్పించడానికి తాము సిద్దమేనని... తాము నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ బహిర్గతమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. నిర్మాణక్రమానికి అనుగుణంగా స్వల్ప మార్పులు అవసరమవడంతో డీపీఆర్ సమర్పించడంలో ఆలస్యమైంది తప్పితే తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు.
అంతర్బేసిన్లలోనే జలాల తరలింపు..
అంతర్ బేసిన్లలోనే నదీ జలాల తరలింపును చేపట్టాలన్న న్యాయ సూత్రాన్ని కేసీఆర్ సమావేశంలో ప్రస్తావించారు. ఒక నదీ బేసిన్లో ఉండే ప్రాంతాల అవసరాలు తీరిన తర్వాత.. అప్పటికీ అదనపు జలాలు ఉంటేనే బేసిన్ అవతలికి తరలించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలన్న కేంద్ర జల్ శక్తి మార్గదర్శకాలను గుర్తుచేశారు. కాబట్టి రాయలసీమ లిఫ్టుతో కృష్ణా జలాలను తరలించే వీలు ఏపీకి లేదన్నారు. ఇక అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956 సెక్షన్-3 కింద కృష్ణా జలాలు కేటాయించాలన్న డిమాండుపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.ట్రిబ్యునల్ ద్వారా త్వరితగతిన నీటి కేటాయింపులు చేస్తామన్నారు.
నీటి కేటాయింపులు,బోర్డుల పరిధి...
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారమై కేంద్రానికి తెలంగాణ సహకరిస్తుందన్నారు కేసీఆర్. అయితే రివర్ బోర్డులు సమర్థంగా పనిచేయాలంటే ముందు నీటి కేటాయింపులు,పరిధి అంశాన్ని తేల్చాల్సి ఉంటుందన్నారు. నాలుగేళ్ల క్రితం తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని సరిగా రికార్డు చేయలేదని... తాజా సమావేశంలో చర్చను,నిర్ణయాలను వీడియో రూపంలో,లిఖితపూర్వకంగా డాక్యుమెంట్ చేయాలన్నారు. సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రులు,కేంద్రమంత్రి సంతకాలు తీసుకున్నాకే మినిట్స్ విడుదల చేయాలన్నారు.