ప్రేమోన్మాది అవినాష్ దాడిలో గాయపడ్డ రవళి చికిత్స పొందుతూ మృతి
హైదరాబాదు: వరంగల్ హన్మకొండలో ప్రేమోన్మాది చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని రవళి మృతిచెందింది. గత వారంరోజులుగా ఆమె మృత్యువుతో పోరాడుతూ సికింద్రబాద్ యశోదా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది.
హనుమకొండ నయిమ్ నగర్ లో ఉన్న వాగ్దేవి కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రవళి అనే యువతిపై అదే కళాశాలలో బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్న అన్వేష్ అనే యువకుడు దాడి చేసాడు. గత కొంతకాలంగా ప్రేమించమని వెంట పడుతున్న ఆ యువకుడు రవళి ప్రేమను నిరాకరించడంతో కక్ష పెంచుకుని కళాశాల కు వెళుతున్న ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అకస్మాత్తుగా జరిగిన దాడితో అటు రవళి షాక్ కు గురయ్యింది. అంతలోనే మంటలు చెలరేగటంతో రవళి దాదాపు 80% కాలిపోయింది. కళ్ళెదుటే యువతి క్షణాల్లో మంటలకు బలైపోయింది. నయీం నగర్ నడి రోడ్డు మీద జరిగిన ఈ ఘటన స్థానికంగా అందరినీ షాక్ కు గురి చేసింది.
80 శాతం కాలిన గాయాలతో ఉన్న రవళి ని మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆమెను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు వైద్యులు. రవళిని బ్రతికించేందుకు వైద్యులు ఎంతగానో శ్రమించారు. కానీ ఫలితం దక్కలేదు. గాయాలు తీవ్రతరం కావడం ఇతరత్రా కాంప్లికేషన్స్తో రవళి తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.
అన్వేష్ చేసిన దాడిలో మృతి చెందిన కూతురు రవళిని చూసి తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. ఆయన్ను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఒక్కగానొక్క కూతురిని పొట్టనబెట్టుకున్న ప్రేమోన్మాది అన్వేష్ను కూడా పెట్రోల్ పోసి తగలెయ్యాలంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రవళి తండ్రి. తన కూతురుని చాలా రోజులగా వేధించాడని రవళి తండ్రి అన్నారు. పోలీసులు కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.ఇదిలా ఉంటే రవళికి వైద్యులు మంగళవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు.