woman ride 1,400 km: అమ్మా నీకు వందనం, స్కూటీపై వందల కిలోమీటర్ల పయనం, ఎందుకంటే..
సాహసం శ్వాసగా సాగిపో.. ఇది ఓ తెలుగు సినిమాలోని పాట. విలన్ నుంచి హీరో, హీరోయిన్ను తీసుకొని వస్తుండగా వచ్చిన పాట, తర్వాత ఆ పేరుతో సినిమా కూడా వచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఓ తల్లి.. తన కుమారుడిని తీసుకొచ్చేందుకు పెద్ద సాహసమే చేశారు. ఔను.. 1400 కిలోమీటర్లు టూ వీలర్పై ప్రయాణించి ఔరా అనిపించారు. పొరుగు రాష్ట్రంలో చిక్కిన తన కుమారుడిని తీసుకురావాలనే లక్ష్యమే తనకు కనిపించిందని.. ఆరోగ్య సమస్యలు.. ఇతర అంశాలను లెక్కచేయలేదని వివరించారు.
Recommended Video
ఇదీ నేపథ్యం..
నిజామాబాద్ జిల్లా బోధన్లో రజియా బేగం (48) కుటుంబంతో నివసిస్తున్నారు. 15 ఏళ్ల క్రితమే భర్త చనిపోవడంతో కుటుంబభారం ఆమెపై పడింది. ఆమె నిజామాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. రజియా బేగానికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ఇంజినీరింగ్ చేస్తుండగా.. చిన్న కుమారుడు ఇంటర్ పూర్తిచేశాడు. ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష కోసం సిద్ధమవుతున్నాడు. అయితే తన స్నేహితుడిని పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో దింపేందుకు మార్చి 12వ తేదీన వెళ్లాడు. తర్వాత దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో ఏం చేయలేకపోయాడు. కానీ తల్లి రజియా మాత్రం భయపడింది. ఏం చేయాలా అని ఆలోచించింది.
కుమారుడిని పంపిద్దామనుకొని..
వాస్తవానికి తన పెద్ద కుమారుడిని పంపిద్దామని అనుకొంది. కానీ పోలీసులు అతడు చెప్పే మాటలను విశ్వసించరని భావించింది. అతడిని నిలువరిస్తే పరిస్థితి ఏంటీ అని ఆలోచించింది. తర్వాత తానే స్వయంగా వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. కారులో వెళ్లాలని అనుకొన్న.. చివరికి టూ వీలర్పై సాహసం శ్వాసగా సాగిపో అని 1400 కిలోమీటర్లు ప్రయాణించి తన మాతృప్రేమను చాటుకొన్నారు. బయల్దేరే ముందు పోలీసుల నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. చెక్ పోస్ట్ వద్ద పోలీసులకు పర్మిషన్ లెటర్ చూపించి.. తన గమ్యం చేరుకొన్నారు.
వెంట రొట్టేలు..
నెల్లూరు వెళ్లాలి.. దారిలో ఏమన్నా దొరుకుతాయో లేదో అనుకొన్నారు. తన వెంట రొట్టెలు తీసుకెళ్లారు. పెట్రోల్ బంక్ వద్ద ఆగి పెట్రోల్ కొట్టించుకొని.. కాసేపు రెస్ట్ తీసుకున్నారు. అల్పహారం, టీ తీసుకొని తిరిగి బయల్దేరేదానినిని గుర్తు చేసుకున్నారు. కానీ లాక్ డౌన్ కావడంతో రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయని.. రాత్రి పూట భయమేసిందని చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 6వ తేదీన బయల్దేరిన ఆమె నెల్లూరులోని రహమతాబాద్కు మరునాడు చేరుకున్నారు. అక్కడ కుమారుడిని కలుసుకొని.. వెంటనే అక్కడినుంచి స్వస్థలం బోధన్ బయల్దేరారు. 8వ తేదీన కుమారుడు నిజాముద్దీన్ వెంట పెట్టుకొని ఇంటికి చేరుకున్నాడు.
1400 కి.మీ ప్రయాణం..
లాక్ డౌన్ సమయంలో తన కుమారుడిని క్షేమంగా తీసుకొచ్చానని.. అంత దూరం ప్రయాణించేందుకు ఆరోగ్య సమస్యలు, ఇతర అంశాలను పట్టించుకోలేదని చెప్పారు. కుమారుడిని తీసుకొచ్చేందుకు రజియా.. 1400 కిలోమీటర్ల టూ వీలర్పై ప్రయాణించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. వార్త సోషల్ మీడియాలో పోస్ట్ అవగా.. నెటిజన్లు కూడా పలు కామెంట్లు పెడుతున్నారు. తల్లి రజియాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.