అమెరికాలో తెలంగాణ యువతి అనుమానాస్పద మృతి
తెలంగాణకు చెందిన ఓ యువతి అమెరికాలో ప్రాణాలు తీసుకుంది. మహబూబాబాద్ జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన సంధ్య టెక్సాస్లో ఆత్మహత్య చేసుకుంది. అయితే సంధ్య మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిది హత్యేనని అంటున్నారు. భర్త, అత్తమామలు కలిసి సంధ్యను హత్య చేశారని ఆరోపిస్తున్నారు.
8 నెలల క్రితం వివాహం
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చింతలపల్లికి చెందిన సెగ్గెం మహేందర్, విమలమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో చిన్న కుమార్తె సంధ్యను తొర్రూర్కు చెందిన సమీప బంధువు దూంపల్లి శ్రీకాంత్కు ఇచ్చి ఎనిమిది నెలల క్రితం వివాహం చేశారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న శ్రీకాంత్ తల్లిదండ్రులతో కలిసి టెక్సాస్లో నివాసం ఉంటున్నాడు. పెళ్లి తర్వాత భార్యను తనతో పాటు అక్కడికి తీసుకెళ్లాడు.
రెండు నెలలుగా వరకట్న వేధింపులు?
శ్రీకాంత్, సంధ్యల దాంపత్య జీవితం ఆరు నెలల పాటు సజావుగానే సాగింది. అయితే రెండు నెలలుగా శ్రీకాంత్, అతని తల్లిదండ్రులు సంధ్యను అదనపు కట్నం కోసం వేధించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సంధ్య శనివారం ఉదయం గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకుందని.శ్రీకాంత్ ఆమె బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు.
సంధ్యను హత్యచేశారంటున్న తల్లిదండ్రులు
సంధ్య ఆత్మహత్య విషయం తెలియగానే ఆమె తల్లిదండ్రులు కుప్పకూలారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు పెళ్లై ఏడాది గడవకముందే శవంగా మారడాన్ని తట్టుకోలేకపోయారు. శ్రీకాంత్, అతని తల్లిదండ్రుల వరకట్న వేధింపుల కారణంగానే తమ కూతురు చనిపోయిందని సంధ్య తండ్రి మహేందర్ ఆరోపించారు. ఈ మేరకు తొర్రూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సంధ్య కుటుంబసభ్యుల్ని పరామర్శించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్తో మాట్లాడి మృతదేహాన్ని త్వరగా రప్పించే ప్రయత్నం చేస్తామన్నారు.